వినే దమ్ము లేకనే పారిపోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు: సీఎం కేసీఆర్
హైదరాబాద్ మార్చ్ 7
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి మనం మాట్లాడే మాటలు వినలేకనే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు పారిపోయారు. వినే దమ్ము కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదన్నారు సీఎం. అధికారంలో శాశ్వతంగా ఎవరూ ఉండలేరు. కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా 4 శాతం ఓట్లకు పరిమితమైంది. ఎల్లప్పుడూ అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీ తాపత్రయం అని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చక్కగా గెలిచినట్టు.. మేము గెలిస్తే పైసలిచ్చి గెలిచినట్టా? అని సీఎం ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో మంచి జరిగినా, చెడు జరిగినా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల దయతోనే మనం అధికారంలో ఉంటామని సీఎం స్పష్టం చేశారు.ఇందిరాగాంధీ లాంటి వారు కూడా సామాన్యుల చేతిలో ఓడారు అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ దుస్థితో ఉందనడానికి సభలో వారి తీరే నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ నిరాశ, నిస్పృహలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి.రాజకీయాల్లో అధికారమే పరమావధిగా ఉండకూడదు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో గెలుపోటములు సహజం. 2014 ఎన్నికల్లో 63 స్థానాలను గెలుచుకున్నాం. 2018 ఎన్నికల్లో 88 స్థానాలను గెలుచుకునే సరికి కాంగ్రెస్కు మతి పోయిందన్నారు సీఎం. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని కాంగ్రెస్ నాయకులు రెండు నెలల పాటు పాట పాడారు. జడ్పీలన్నీ బ్యాలెట్ పేపర్పైనా గెలుచుకున్నామని సీఎం తెలిపారు. ఈవీఎంలు అయినా, బ్యాలెట్ అయినా టీఆర్ఎస్సే గెలిచింది అని సీఎం స్పష్టం చేశారు. ప్రజా జీవితంలో ఉండటమనేది ఒక మంచి అవకాశమని చెప్పారు.