నిరాశలో పంచుమర్తి
విజయవాడ, మార్చి 9
విజయవాడకు చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు పంచుమర్తి అనురాధ ఇప్పుడు ఆ పార్టీ పొలిటికల్ సర్కిళ్లలో ప్రధాన వార్తగా మారారు. దాదాపు 20 ఏళ్లుగా టీడీపీలో ఉన్న పంచుమర్తికి ఇప్పుడు ప్రాధాన్యం పెరగడం, అది కూడా మరో రూట్లో అనే ప్రచారం పెరగడంపై సందేహాలు కామన్. గతంలో విజయవాడ మేయర్గా పనిచేసిన పంచుమర్తి అనూరాధ తర్వాత పార్టీలో కీలక నాయకురాలిగా ఎదిగారు. ఎన్నికలకు ముందు కూడా ఆమె పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపించారు. అనూరాధ విజయవాడ మేయర్ గా పనిచేశాక ఆమెకు పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి ఏదో ఒక పదవి వస్తుందనుకుంటున్న టైంలో ఏదో ఒక సమస్య రావడంతో ఆమె కలలు నెరవేరలేదు.అయితే, మంగళగిరి టికెట్ను గత ఏడాది ఎన్నికల సమయంలో ఆమె ఆశించారనే ప్రచారం సాగింది. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఎవరి ఆశలనూ పట్టించుకోకుండా తన కుమారుడికి టికెట్ కేటాయించుకున్నారు. దీంతో పంచుమర్తి అనూరాధ కొద్దిగా హర్ట్ అయ్యారు. అయితే వెంటనే తేరుకుని పార్టీలో రెండో బాస్ కోసం ఎన్నికల్లో ప్రచారం చేశారు. అంతా బాగానే ఉంది. ఈ క్రమంలోనే ఆమె బీసీ కోటాలో కనీసం తనకు తెలుగు మహిళా అధ్యక్షురాలు పోస్టయినా దక్కుతుందని భావించారు. అయితే పంచుమర్తి అనూరాధ ఒకటి తలిస్తే.. పైనున్న అధినేత చంద్రబాబు మరొకటి తలిచాడు.ఎస్సీలకు వైసీపీ అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో తను కొంచెమైనా ప్రాధాన్యం ఇవ్వకపోతే ఎలా అనుకున్నారు. ఈ క్రమంలో నే పంచుమర్తి అనురాధ అభ్యర్థనను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే వంగల పూడి అనితకు అవకాశం ఇచ్చారు. ఈ పరిణామంతో మరింత హర్ట్ అయిన పంచుమర్తి అనూరాధ ఓ వారం రోజులు మీడియాకు ముఖం చాటేశారు. అయితే, తాజాగా టీడీపీ అనుకూల మీడియాకు చంద్రబాబు కార్యాలయం నుంచి ఓ ప్రకటన అందిందట. దీనిలోని సారాంశం గోప్యంగానే ఉన్నప్పటికీ పంచుమర్తే బయట పెట్టుకున్నారు. అదేంటంటే.. ఇతర నేతల వార్తలకు ప్రాధాన్యం ఇచ్చినా ఇవ్వకున్నా.. అనురాధ వార్తలను హైలెట్ చేయాలని ఆ ప్రకటన సారాంశంగా ఉందట.దీంతో టీడీపీ అనుకూల మీడియాలో అనురాధ వార్తలకు అనూహ్యంగా ప్రాధాన్యం పెరిగిపోయింది గతంలో ఓ రెండు లైన్లో,, రెండు సెకన్లో చూపించే పంచుమర్తి ప్రెస్మీట్లను ఇప్పుడు ఆసాంతం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్రతం చెడ్డా ఫలితం దక్కిందనే ఆనందంలో అనురాధ ఉన్నారట. మరి ఈ ప్యాకేజీ ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి. ఏదేమైనా అనురాధకు కాలం కలిసి రావడం లేదని అంటున్నారు టీడీపీలోని ఓ వర్గం నేతలు.