ముగ్గురు లెక్క తేలిపోయింది...
విజయవాడ, మార్చి 9
నలుగురు రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ దాదాపుగా ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. విజయసాయిరెడ్డి సిఫార్సుతో ఒకరికి, తాను మాట ఇవ్వడంతో ఇద్దరికి ఇప్పటికే జగన్ టిక్ పెట్టేశారు. మరో సీటు విషయంలో మాత్రం ఇంకా తేల్చలేదు. అది ఎవరికి జగన్ ఇస్తారన్న ఉత్కంఠ పార్టీలో నెలకొంది. అయితే ఆ ఒక్క సీటు మాత్రం లాస్ట్ మినిట్ లో డిసైడ్ చేస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. నాలుగు కూడా వైసీపీకే దక్కనున్నాయి. జగన్ ఓకే అంటే చాలు పెద్దల సభకు వెళ్లినట్లే. రాంకీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డికి ఒక సీటు కన్ఫర్మ్ అయింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు అయిన అయోధ్య రామిరెడ్డికి టిక్ పెట్టేశారు. ఆళ్లకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోవడంతో ఈ విధంగా ఆ కుటుంబంలో జగన్ రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు.ఇక బీసీ కోటా కింద బీద రవిచంద్ర పేరు దాదాపుగా ఖరారయింది. బీద రవిచంద్ర ఎంపిక వెనుక విజయసాయిరెడ్డి ఉన్నారు. విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం, ఇటీవలే పార్టీలో చేరేటప్పుడు రాజ్యసభ స్థానాన్ని ఇస్తామని హామీ ఇవ్వడంతో బీద రవిచంద్రకు దాదాపు ఖరారయిందంటున్నారు. ఇక మూడో సీటు ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీకి జగన్ ఖరారు చేశారు. నత్వానీ బీజేపీకి సన్నిహితుడు కూడా కావడంతో ఆయనకు ఒక సీటు రిజర్వ్ చేసి ఉంచారు.నాలుగో సీటు విషయంలోనే జగన్ ఇంకా డిసైడ్ కాలేదంటున్నారు. ఓసీ, బీసీ లకు సీట్లు కేటాయించడంతో ఇక నాలుగో సీటును ఎస్సీలకు కేటాయించాలన్న దానిపై జగన్ కసరత్తు చేస్తున్నారు. ఎస్సీ మహిళలకు ఇవ్వాలన్న యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎవరి పేరును ఇంకా ఖరారు చేయలేదు. ఈ అభ్యర్థి పేరును మాత్రం చివరి క్షణంలో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. మొత్తం మీద ఒక ఓసీ, ఒక బీసీ, ఒక ఎస్సీ మహిళకు ఇస్తే ఒకటి రిలయన్స్ కోటాలో వెళ్లిపోతుంది.