ఢమాల్..ఢమాల్ అంటున్న కరోనా
న్యూఢిల్లీ, మార్చి 9
కరోనా వైరస్ ప్రపంచం మొత్తానికీ శాపంగా మారుతోంది. దీనివల్ల గ్లోబల్ ఎకానమీ జీడీపీ 0.1 శాతం నుంచి 0.4 శాతం వరకు తగ్గుతుందని ఏషియా డెవెలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) అంచనా వేసింది. ఆర్థికపరమైన నష్టాల విలువ 77 బిలియన్ల నుంచి 347 బిలియన్ల వరకు (రూ.5,00,00 కోట్ల నుంచి రూ.25,00,000 కోట్ల వరకు) ఉంటుందని తెలిపింది. చైనా ఎకనమిక్ గ్రోత్ 1.7 శాతం వరకు, వర్ధమాన ఏసియా దేశాల ఎకనమిక్ గ్రోత్ 0.5 శాతం వరకు తగ్గుతుంది. కరోనా వల్ల ఆర్థికంగా నష్టం జరగడం సహా పలు ఇబ్బందులు ఎదురవుతాయని ఏడీబీ చీఫ్ ఎకనమిస్ట్ యసుయుకి సవాడా అన్నారు. కరోనా కేసులు పెరగడం వల్ల డొమెస్టిక్ డిమాండ్ బాగా తగ్గుతుందని, టూరిజం, ట్రావెల్ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. వస్తువుల సప్లైలు బాగా తగ్గడం వల్ల ఏషియాలో వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలకు నష్టం ఉంటుందని వివరించారు. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు ప్రయాణాలపై నిషేధం ఎత్తివేస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలకు 156 బిలియన్ల నష్టం వాటిల్లిందని, ఇది గ్లోబల్ జీడీపీలో 0.2 శాతానికి సమానమని ఏడీబీ తెలిపింది. ఒక్క చైనాకే 103 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. ఇది దాని జీడీపీలో 0.8 శాతానికి సమానం. మిగతా ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వచ్చిన నష్టం విలువ 22 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. ఇండియా టూరిజం సెక్టార్ నష్టం 84.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.623 కోట్లు) వరకు ఉండొచ్చని ఏడీబీ తెలిపింది. పరిస్థితులు మరింత విషమిస్తే నష్టం 252 మిలియన్ డాలర్ల వరకు చేరొచ్చని పేర్కొంది. కరోనాను అడ్డుకునేందుకు ఏడీబీ ఏసియా దేశాలకు 40 లక్షల డాలర్ల సాయం ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఈ వైరస్ కారణంగా ప్రస్తుతం ఏడాది ఏసియా పసిఫిక్ దేశాల ఆర్థిక వ్యవస్థలు 21,100 కోట్ల డాలర్లు నష్టపోయే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. చైనా గ్రోత్రేటుపై మూడుశాతం వరకు ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. జపాన్, ఆస్ట్రేలియా, హాంగ్కాంగ్ దేశాలూ భారీగా నష్టపోవచ్చని అంచనా వేసింది