లోకల్ ఫైట్ పై టీడీపీ ఆశలు
నెల్లూరురు, మార్చి 9 మంత్రులకు స్థానిక సంస్థల ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఎన్నికలకు సిద్ధమయిపోతున్నాయి. అధికార వైసీపీకి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు సవాల్ గా మారనున్నాయి. కేవలం పది నెలల్లోనే ఎన్నికలను ఎదుర్కొనాల్సి వస్తుండటంతో ఫలితాలు అనుకూలంగా లేకుంటే దాని ప్రభావం వచ్చే నాలుగేళ్ల మీద పడనుంది.అందుకే వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యతను ఆ జిల్లాకు చెందిన మంత్రులకు అప్పగించారు. ఇన్ ఛార్జి మంత్రులకు కూడా టార్గెట్ పెట్టారు. ప్రతి మంత్రికి సంబంధించిన పనితీరు నివేదిక తన వద్ద ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విఫలమయితే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని హెచ్చరించారంటే జగన్ స్థానిక సంస్థల ఎన్నికల పట్ల జగన్ ఎంత సీరియస్ గా ఉన్నారో చెప్పకనే తెలుస్తోంది తాము ఇప్పటి వరకూ అమలు చేసిన సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని జగన్ నమ్ముతున్నారు. అందుకే ఎమ్మెల్యేలు, పార్టీ నేతలందరూ సంక్షేమ పథకాలను ప్రజలు వద్దకు తీసుకెళ్లాలని కొంచెం కటువుగానే చెప్పారు. పది నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం లేదని జగన్ అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు వెళ్లేందుకు ఇదే సరైన సమయమని కూడా జగన్ భావిస్తున్నారు. అందుకే పూర్తి బాధ్యతలను మంత్రులకు అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.మరోవైపు టీడీపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది. మూడు రాజధానుల ప్రతిపాదన, రివర్స్ టెండర్లు, శాసనమండలి రద్దు, మద్యం అమ్మకాలు వంటి అంశాలు తమకు కలసి వస్తాయని భావిస్తుంది. జగన్ ప్రభుత్వం పది నెలల్లో తీసుకున్న నిర్ణయాలే తమకు శ్రీరామరక్షగా టీడీపీ భావిస్తుంది. అధికార పార్టీ బెదిరింపులకు భయపడకుండా ఎన్నికల్లో పోరాడాలని చంద్రబాబు ఇప్పటికే పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల అంశం తేలిపోవడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తమయ్యాయి.