పరిమళ్ నెత్వానీకి రాజ్యసభ
విజయవాడ, మార్చి 9
ఏపీలో వైసీపీ తరపున రాజ్య సభ సభ్యుల పేర్లను ఫైనల్ చేశారు సీఎం జగన్. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించనున్నారు జగన్. రాజ్యసభకు మాజీ మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు అయోధ్య రామిరెడ్డి,పరిమల్ నత్వానికి సీట్లిచ్చారు. ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సీఎం జగన్ ని తాడేపల్లిలో కలిసిన సంగతి తెలిసిందే. అంబానీ ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకోసం వచ్చారని ముందు ప్రకటించినా, అసలు కథ రాజ్యసభ సీటుకోసమే అని తర్వాత తెలిసింది. ఎట్టకేలకు అంబానీ అడిగితే జగన్ కాదనగలరా. తన అనుంగు మిత్రుడు పరిమళ్ నత్వానీని మరోసారి రాజ్యసభకు పంపేందుకు ఏపీని ఎంపికచేశారు. జగన్ ని కలిసి రాజ్యసభ బెర్త్ కన్ ఫర్మ్ చేసుకున్నారు. పరిమల్ నత్వాని ఝార్ఖండ్ నుంచి రెండు సార్లు రాజ్యసభకు వెళ్ళారు. ఇప్పుడు ఆయన మళ్ళీ రాజ్యసభకు వెళ్ళే అవసరం ఉందని, బిజెపి బలాబలాలు ఆయన్ను రాజ్యసభకు పంపించలేవు కాబట్టి ఏపీ నుంచి జగన్ ద్వారా పంపాలని చూసారు. అదే మంత్రాంగం సాగించారు.ముందే చెప్పినట్టు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మార్చి 13వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అదే సమయంలో మార్చి 16న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. మార్చి 18లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. దీని తరువాత మార్చి 26న ఉదయం నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వనుండగా. ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో మొహద్ అలీఖాన్, టి. సుబ్బిరామిరెడ్డి, కె. కేశవరావు, తోటా సీతారామ లక్ష్మీ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 9న ముగియనుంది. కొద్దిరోజులుగా జగన్మోహన్రెడ్డి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి సమాలోచనలు చేశారు. పలువురి సీనియర్ నేతలను సంప్రదిస్తూ పేర్లు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, గుంటూరు జిల్లాకు చెందిన అయోధ్య రామిరెడ్డిల పేర్లు మూడు స్థానాలకు దాదాపు సీఎం జగన్మోహన్రెడ్డి ఖరారుచేసినట్లు వచ్చిన వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యేలు బీద మస్తాన్రావుల పేర్లను సీఎం జగన్మోహన్రెడ్డి పరిశీలించినా వారి వైపు జగన్ మొగ్గుచూపలేదు. నత్యానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే రియల్స్ నుంచి భారీగా పెట్టుబడులు ఏపీకి వచ్చే అవకాశాలుంటాయని జగన్మోహన్రెడ్డి భావిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. నలుగురి పేర్లు ఖరారు కావడంతో టికెట్ ఆశించిన వైసీపీ నేతలు నిరాశకు గురయ్యారు. తమకు పెద్దల సభలో జగన్ చోటిస్తారని భావించినా, అంబానీ లాబీయింగ్ ముందు జగన్ తలవంచకతప్పలేదనే వార్తలు వస్తున్నాయి. శాసనమండలి రద్దు సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు రాజ్యసభ సీట్లిచ్చారు. ఇటు అయోధ్య రామిరెడ్డికి ఇవ్వడం వెనుక కూడా జగన్ ప్రాధాన్యతలున్నాయి. మరోవైపు సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి పేరుకూడా ప్రముఖంగా వినిపించింది. కానీ జగన్ అటువైపు మొగ్గుచూపకపోవడం విశేషం.