ప్రతిపక్షాలకు ఎడ్జ్ ఇవ్వకూడదనేనా...
నెల్లూరు, మార్చి 11
ఎన్నికలు ఏవైనా సమరమే. సార్వత్రికమైనా.. స్థానిక ఎన్నికలైనా.. నాయకుల మధ్య , ప్రత్యర్థి పార్టీల మధ్య తీవ్రస్థాయిలో పోరు సాగుతుంది. ఎంత ప్రచారం చేసినా ఇంకా మిగిలే ఉంటుంది. దీంతో నాయకులు ఏ పార్టీ వారైనా కూడా ప్రచారపర్వానికి ప్రాధాన్యం ఇస్తారు. అయితే, ఇప్పుడు త్వరలో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు చిత్రమైన విషయం తెరమీదికి వచ్చింది. పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సాధారణంగా 21 రోజుల గడువు ఉంటుంది. 73, 74 రాజ్యాంగ సవరణలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అయితే, వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న స్వేచ్ఛ, ప్రత్యర్థులకు శాపంగా పరిణమిస్తోందనే వాదన వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలోనే సాగాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనే అంతా చూసుకుంటుంది.ఇప్పుడు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు కూడా రాష్ట్ర ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఎన్నికల కమిషనే నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి జగన్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఎన్నికల గడువును 21 రోజుల నుంచి భారీగా తగ్గించింది. పంచాయతీ ఎన్నికలకు 13 రోజులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 15 రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. దీంతో ఆయా రోజుల్లోనే ఎన్నికల నిర్వహణ, ప్రచారం, అభ్యర్థుల వడబోత వంటివి సాగాలి. అభ్యర్థుల తుది జాబితా వెలువడిన తర్వాత పంచాయితీ ఎన్నికలకు 4 రోజులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కేవలం 6 రోజులు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉంటుంది. దీంతో ప్రతిపక్షాలు సహా అధికార పక్షం సభ్యులు కూడా లబోదిబో మంటున్న పరిస్థితి ఉంది. ఎలా చూసుకున్నా ఈ సమయం సరిపోదని అంటున్నారు.తక్కువ సమయంలో ఎలా ప్రచారం చేసుకోవాలి. సుడిగాలిపర్యటనలు, ప్రచారం చేసుకున్నా ఇంత తక్కువ సమయంలో పంచాయతీల్లో ఎలా పర్యటించాలి? అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడే అసలు జగన్ వ్యూహం ఉందని అంటున్నారు మేధావులు. ఇలా సమయం కుదించడం వల్ల ప్రత్యర్థి పక్షానికి ప్రచారం చేసుకునే వెసులుబాటును భారీగా తగ్గించవచ్చనేదివ్యూహం. ఇప్పటికే అధికార పక్షం వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చేరువయింది. దీనికి పెద్దగా ప్రచారం అవసరం లేదు.అధికార పక్షం అభ్యర్థులు పెద్దగా ప్రచారం మిస్సయినా.. వచ్చే నష్టం ఉండదు. కానీ, ప్రత్యర్థి పక్షాలకు మాత్రం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కొత్తవారే కనుక బరిలోకి దిగితే.. వారిని వారు పరిచయం చేసుకునేందుకు కూడా సమయం ఉండాలి. అయితే, ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉండడంతో అధికార పార్టీకే మేలు జరుగుతుందని అంటున్నారు మేధావులు. మరి జగన్ వ్యూహాన్ని వైసీపీ నాయకులు అర్ధం చేసుకుంటారో లేదో చూడాలి.