ఆర్టీఏ సాంకేతిక సేవలపై జమ్ము కశ్మీర్ రవాణా అధికారుల బృందం అధ్యయనం
- అందిస్తున్న పౌర సేవలు భేష్ అంటూ బృందం కితాబు
హైదరాబాద్ మార్చి 11
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ మెరుగైన సేవలు అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖా ఆన్లైన్ సేవల విధానం బాగుందని జమ్ము కశ్మీర్ రవాణా అధికారుల బృందం కితాబు ఇచ్చింది. సామాన్య ప్రజలకు సైతం చేరువ చేసిన ఆన్లైన్ సేవలను అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసిన జమ్ము కశ్మీర్ రవాణా శాఖ కమిషనర్ శ్రీ ప్రదీప్ కుమార్ నేతృత్వంలో అధికార బృందం మంగళవారం ఖైరతాబాద్లోని డా.బి.ఆర్.అంబేద్కర్ ట్రాన్స్పోర్ట్ భవన్లో ప్రత్యేకంగా భేటీ అయ్యి సేవల విధానాన్ని పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ ల బుకింగ్, లెర్నింగ్ (ఎల్ఎల్ఆర్)/డ్రైవింగ్ లైసెన్స్లు పొందడం, రెన్యూవల్ (నవీకరణ) చేయించుకోవడం, వాహనాల ఓనర్షిప్ల బదిలీలు, చిరునామా మార్పు, డూప్లికేట్ లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసుకోవడం వంటి విధాన ప్రక్రియలపై అధ్యయనం కొనసాగింది. ఆర్టీఏ కార్యాలయాలకు రాకుండానే ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే ప్రక్రియను సరళతరం చేసిన విధానానంతో పాటు పౌరులు తేలికగా పొందుతున్న సేవల్ని రవాణా కమిషనర్ శ్రీ ఎం.ఆర్.ఎం రావు వారికి వివరించారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రజలకు సౌలభ్యమైన సేవల్ని అందించాలన్న లక్ష్యంతో సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్న దిశలోనే ఆర్టీఏలో ఆన్లైన్ విధానాన్ని మరింత మెరుగు పరుస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆర్టీఏలో తీసుకువస్తున్న సంస్కరణలు, సాంకేతిక వనరుల సమీకరణ, తదితర వాటికి సంబంధించిన విషయాలపై బృంద సభ్యులు అధ్యయనం చేశారు. ఆ పిమ్మట పౌరులకు అందుతున్న ఆన్లైన్ సేవలపై బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సి. రమేశ్, సీనియర్ సాఫ్ వేర్ ఇంజనీర్ మధుసూధన్, తదితరులు పాల్గొన్నారు.