టీడీపీ నేతలపై దాడి
గుంటూరు మార్చి 11
తెదేపా నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమా మహేశ్వరరావు వెళ్తున్న వాహనంపై మాచర్లలో వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. కర్రలతో చేసిన దాడి నుంచి తెదేపా నేతలు తృటిలో బయటపడ్డారు. తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుకు సంబంధించిన వాహనంలో వెళ్తుండగా వైకాపా యువజన నాయకులు దాడి చేశారు. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి కారును వేగంగా నడిపించడంతో ముప్పు తప్పింది. ఘటనపై బోండా ఉమ మాట్లాడుతూ మాచర్ల ఘటనపై పీఎస్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాం. మా వాహనాలపై వైసీపీ నేతలు కర్రలతో దాడి చేశారు. మా వాహనాలతో పాటు పోలీసు వాహనాలపై కూడా దాడి చేశారు. కర్రలతో నన్ను, మా అడ్వొకేట్ను కొట్టారు. మాకు గాయాలయ్యాయి, రక్తం కూడా కారింది. డీఎస్పీపై కూడా దాడి చేశారు. పోలీసు రక్షణ ఉన్నా మాపై దాడి జరిగింది. ప్రాణాలతో బయటపడతామనుకోలేదని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ పల్నాడులో మా పర్యటన వివరాలను వైసీపీకి పోలీసులు అందించారు. అడుగడుగునా మాపై దాడులకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల వాహనాలను కూడా ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.