.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ ఫైర్
న్యూఢిల్లీ, మార్చి 11
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చివేయడంలో తీరిక లేకుండా గడుపుతున్నారని, అంతర్జాతీయంగా తగ్గిన చమురు ధరలను గుర్తించడం లేదని దుయ్యబట్టారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని కోల్పోయిన ఏడాది తిరగక ముందే మధ్య ప్రదేశ్లో ప్రభుత్వం రాజకీయ సంక్షోభంలో పడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా ప్రధాని మోదీని నిలదీశారు. హే, పీఎంఓఇండియా, ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడంలో మీరు తీరిక లేకుండా ఉండగా, అంతర్జాతీయ చమురు ధరలు 35 శాతం తగ్గడాన్ని మీరు గమనించలేనట్లుంది. లీటరు పెట్రోలు ధరను రూ.60 కన్నా తక్కువకు తగ్గించి భారతీయులకు ఆ లబ్ధిని దయచేసిన అందజేయగలరా? స్తంభించిన ఆర్థిక వ్యవస్థ బలపడటానికి దోహదపడుతుంది అని మోదీకి రాహుల్ సలహా ఇచ్చారు. సౌదీ అరేబియా, రష్యా మధ్య చమురు ధరల యుద్ధం జరుగుతోంది. దీంతో ఈ వారంలో అంతర్జాతీయ చమురు ధరలు 30 శాతం వరకు తగ్గాయి. మన దేశంలో కూడా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతున్నాయి. సోమ, మంగళవారాల్లో వీటి ధరలు తగ్గినప్పటికీ, అంతర్జాతీయంగా తగ్గిన ధరలతో పోల్చినపుడు ఈ తగ్గుదల నామమాత్రంగా కనిపిస్తోంది.