టీచరమ్మకు తప్పని తిప్పలు
విశాఖపట్టణం, మార్చి 12,
వంగలపూడి అనిత. టీడీపీ నాయకురాలు, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు. అయితే, ఆమెకు రాజకీయంగా ఇప్పుడు కూడా కలిసి రావడం లేదనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. 2014లో అనూహ్యంగా రాజకీయ తెరమీదికి వచ్చిన ఈ టీచరమ్మ. చంద్రబాబు ఆశీస్సులతో పాయకరావు పేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే, నియోజకవర్గానికి విజిటింగ్ ఎమ్మెల్యేగా మారిపోవడంతో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. నిజానికి విశాఖ అంటేనే రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా. అలాంటి జిల్లాలో గెలిచిన నాయకురాలిగా. అందునా కొత్తనేతగా ఆమె పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. కానీ వంగలపూడి అనిత అప్పట్లో కుటుంబ వ్యవహారాలతోనే బిజీగా మారిపోవడంతోపాటు హైదరాబాద్లోనే ఎక్కువ సమయం ఉండడంతో నియోజకవర్గానికి దూరమయ్యారనే భావన స్థానికంగా ఏర్పడింది.దీనినే టీడీపీ నాయకులు ఎత్తి చూపించారు. మీరు మాకు వద్దు..! అంటూ నేరుగా వంగలపూడి అనితకే సందేశాలు పంపేవారు. అంతేకాదు, అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు కూడా చెప్పారు. ఈ పరిణామం ఆమె ఎమ్మెల్యేగా ఉన్నసమయంలోనే తీవ్రస్థాయిలో రాజుకోవడంతో అనేకసార్లు చంద్రబాబు రాజీ చేసే ప్రయత్నం చేశారు. అయినా ఫలించలేదు. తీరా గత ఏడాది ఎన్నికల సమయానికి అసలు ఆమెకు టికెట్ ఇవ్వద్దొంటూ.. కొందరు రోడ్డెక్కారు. ఇక, విధిలేని పరిస్థితిలో వంగలపూడి అనితను అక్కడి నుంచి మార్చి పశ్చిమ గోదావరిజిల్లా కొవ్వూరుకు మార్చారు. అయితే, ఇక్కడ ఆ ఎన్నికల్లో వంగలపూడి అనిత పరాజయం పాలయ్యారు. అయితే,గెలుపు ఓటములు సహజం అయినా ఎన్నికల్లో ఓటమి చెందినంత మాత్రాన నియోజకవర్గాన్ని ఎవరూ వదిలేయరు. కానీ, అనిత మాత్రం కొవ్వూరును వెంటనే వదలిపెట్టేశారు.గత ఎన్నికల్లో పాయకరావుపేటలో ఓడిన డాక్టర్ బంగారయ్య రాజకీయాలకు దూరమయ్యారు. ఇక అనిత కొవ్వూరుకు టాటా చెప్పేసి వెంటనే మళ్లీ పాయకరావుపేటకు వెళ్లి అక్కడ తిష్టవేశారు. ఈ క్రమంలోనే తాజాగా అనితను తెలుగు మహిళ అధ్యక్షురాలిని చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే, ఇప్పుడు ఇక్కడ మరోసారి టీడీపీలో కలకలం రేగింది. తాము వద్దని చెప్పిన అనితను తీసుకువచ్చి మాపై ఎందుకు రుద్దుతున్నారంటూ దిగువ శ్రేణి నియోజకవర్గం నాయకులు రోడ్డెక్కారు. ఈ పరిణామాలు నియోజకవర్గంలో మరోసారి రాజకీయ రచ్చకు దారితీశాయి.అయితే, తనకు ఈ నియోజకవర్గమే కావాలని వంగలపూడి అనిత కోరుతుండడం గమనార్హం. పోనీ.. చంద్రబాబు అయినా.. ఇక్కడి పరిస్థితులను గమనించి వ్యవహరిస్తే.. బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కలిసిరాని నాయకులతో అనిత ఎంత దూరం ప్రయాణం చేస్తారనే వాదన వినిపిస్తుండగా.. విజింటింగ్ నాయకురాలితో తమకు పనేంటని ఇక్కడి టీడీపీ నాయకులు అంటున్నారు. ఇదే టైంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో పాయకరావుపేటలో వంగలపూడి అనిత ఓ వైపు… ఆమెను వ్యతిరేకంచే వర్గం మరోవైపు ఉన్నాయి. దీంతో పాయకరావుపేట రాజకీయం టీడీపీలో పరేషాన్ పుట్టిస్తోంది