ఇన్ స్టంట్ ప్రయోజనమే...
గుంటూరు, మార్చి 12
ఇప్పటి వరకూ ఆర్థికంగా టీడీపీ నేతలను దెబ్బతీసిన వైసీపీ అధినాయకత్వం ఇప్పుడు మానసికంగా కుంగదీయడానికి రెడీ అయిపోయంది. ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. ఎమ్మెల్యేలును చేర్చుకోవడం పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలను చేర్చుకోవడం ప్రారంభించింది. నిజానికి ఇప్పుడు వైసీపీకి ఉన్న బలంతో ఏ నేత అవసరం పార్టీలో చేర్చుకునే అవసరం లేదు. ఎక్కువ మంది నేతలను చేర్చుకోవడం ద్వారా నియోజకవర్గాల్లో గ్రూపు విభేదాలు ఎక్కవవుతాయి తప్పించి మరో ప్రయోజనం ఉండదు.అన్నీ తెలిసినప్పటికీ జగన్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు. ప్రధానంగా టీడీపీ, జనసేనల నుంచి ఎక్కువ మంది నేతలను చేర్చుకుని స్థానికసంస్థల ఎన్నికలలో ఏకగ్రీవం చేసే దిశగా జగన్ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ కోవలోనే విశాఖ నుంచి రహమాన్, మాజీ మంత్రి బాలరాజు, ప్రకాశం జిల్లా నుంచి కదిరి బాబూరావు, కడప జిల్లా నుంచి సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డిలను పార్టీలో చేర్చుకుంటోంది. దీనివల్ల వెంటనే ఒన గూరే ప్రయోజనం స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మాత్రమే.దీర్ఘకాలంలో జగన్ పార్టీకి చిక్కులు తప్పవని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు. ఈ చేరికల వల్ల ప్రత్యర్థి పార్టీకి సానుభూతి పెరగడం తప్ప మరొకటి ఉండదంటున్నారు. గతంలో కూడా చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి టీడీపీలో చేర్చుకుని అప్రదిష్టను మూటగట్టుకున్నారు. దాని ఫలితాన్ని ఇప్పటికీ అనుభవిస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలను పరిష్కరించలేక చేతులెత్తేసిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం.ఈ సంగతి కనపడుతున్నప్పటికీ జగన్ ఏం ప్రయోజనాన్ని ఆశించి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారన్న ప్రశ్న తలెత్తుతోంది. నేతలు చేరినంత మాత్రాన గంపగుత్తగా వారితో పాటు ఓట్లు తరలి వస్తాయన్నది భ్రమే అవుతుంది. అయితే ఇన్ స్టెంట్ ప్రయోజనం మాత్రం జగన్ పార్టీకి దక్కే అవకాశముంది. మరికొందరు టీడీపీ నేతలను కూడా పార్టీలో చేర్చుకోవడానికి జగన్ రెడీ అయిపోయారు. వరసగా వారం రోజుల పాటు వైసీపీలో చేరికలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి