సుంకరకు జెడ్పీపీ ఛైర్మన్ టీడీపీ ఆఫర్
విజయవాడ, మార్చి 13
స్థానిక ఎన్నికల పుణ్యమా అని చాలా మంది నాయకులకు లైఫ్ వస్తోందని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా కాంగ్రెస్లో ఉండి ఇప్పటి వరకు పెద్దగా గుర్తింపునకు నోచని నాయకులు ఈ ఎన్నికలతో కొంత వెలుగులోకి వస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి వారిలో కృష్ణాజిల్లాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సుంకర పద్మశ్రీ. గన్నవరం నియోజకవర్గంలో చక్రం తిప్పాలని భావించిన కాంగ్రెస్ నాయకురాలు. అయితే, కాంగ్రెస్ పెద్దగా రాణించకపోవడంతో సుంకర పద్మ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసినా.. కూడా విజయం సాధించలేక పోయారు. 2009 ఎన్నికలకు ముందు నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున గన్నవరంలో యాక్టివ్గా ఉంటున్నారు. ఆ ఎన్నికల్లో ఆమె సీటు ఆశించినా రాలేదు.ఇక 2019 ఎన్నికల తర్వాత ఆమె కాంగ్రెస్లోనే ఉన్నప్పటికీ టీడీపీకి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. టీడీపీ వాళ్లతో కలిసి అనేక ఉద్యమాలు చేస్తున్నారు. దీనికి గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వంశీ పార్టీ మార్పు కూడా కలిసివచ్చింది. ఇక, రాజధాని ఉద్యమాలు సహా టీడీపీ పిలుపు నిస్తున్న కార్యక్రమాల్లో కాంగ్రెస్ జెండాతోనే పాల్గొన్నారు. ఇటీవల కాలంలో రాజధాని ఉద్యమం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సుంకర పద్మశ్రీ యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. మహిళా జేఏసీ నాయకురాలిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు పదునైన వ్యాఖ్యలతో విమర్శలు సంధిస్తారనే పేరు తెచ్చుకున్నారు. కట్ చేస్తే.. స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో సుంకర పద్మశ్రీ దశ తిరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అటు అధికార పక్షం వైసీపీ నుంచి ఇటు ప్రతిపక్షం టీడీపీ నుంచి కూడా పద్మకు ఆహ్వానాలు అందుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. కృష్ణా జెడ్పీ సీటు మహిళలకు కేటాయించారు. అయితే, వైసీపీకి మహిళా నాయకురాళ్లు లేరు. ఉన్నా కూడా అంతగా ప్రచారంలోనూ లేరు దీంతో పద్మను పార్టీలోకి తీసుకుని జెడ్పీ స్థానానికి పోటీ పెట్టాలని బావిస్తున్నారు. ఇదిలావుండగా, ప్రతిపక్షం టీడీపీ నుంచి కూడా పద్మశ్రీకి ఆహ్వానం అందింది. ఇప్పటి వరకు పార్టీతో కలిసి తిరుగుతున్నావు కదా.. ఇక, పార్టీలోకి వచ్చెయ్.. జడ్పీ చైర్ పర్సన్ సీటు ఇస్తాం అంటూ రెండు పార్టీల నుంచి ఆహ్వానం అందింది. దీంతో ఆమెకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్ధం కావడం లేదు.వాస్తవానికి కృష్ణా మాజీ జడ్పీ చైర్ పర్సన్గా గద్దె అనురాధ ఉన్నప్పటికీ టీడీపీకి ఇప్పుడు ఆమె అక్కరకు రాలేదు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో తన ఓటును తూర్పు నియోజకవర్గానికి మార్చుకున్నారు. దీనికితోడు ఈ దఫా విజయవాడ నగర మేయర్ రేసులో అనురాధ ఉన్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో చంద్రబాబు జడ్పీచైర్మన్ సీటు విషయంలో సుంకర పద్మశ్రీ వైపు మొగ్గు చూపుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తానికి నిన్న మొన్నటి వరకు పెద్దగా డిమాండ్ లేకుండా పోయిన పద్మశ్రీకి హఠాత్తుగా ఆఫర్లు రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారట.