మళ్లీ డిగ్గీరాజకు ఎంపీ నుంచి రాజ్యసభ
మారని అధిష్టానం
భోపాల్, మార్చి 13,
ఒకనాడు చెయ్యెత్తి జైకొట్టిన పార్టీ ఈరోజున సొంత పార్టీ అధికారంలో ఉన్నచోట్ల సైతం ఉసూరుమంటోంది. అస్తవ్యస్త పరిస్థితులతో పార్టీ భవిష్యత్తును పణంగా పెడుతోంది. అధిష్టానానికే దిశానిర్దేశం కరవైంది. సిండికేట్ వలలో చిక్కుకుని విలవిలాడుతోంది. వృద్ధజంబూకాల్లాంటి నేతలు పార్టీ జవసత్తువలను పీల్చి పిప్పిచేస్తున్నారు. రాజకీయ నైపుణ్యం కొరవడిన అగ్రనాయకులు పార్టీని గాలికి వదిలేసినట్లే కనిపిస్తోంది. మొత్తమ్మీద కాంగ్రెసు పార్టీ దుస్థితి మధ్యప్రదేశ్ ఉదంతంతో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. కాంగ్రెసు సొంత ఏలుబడిలో ఉన్న పెద్ద రాష్ట్రం చేజారిపోయినట్లే. దీనికి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పార్టీ నాయకత్వమే బాధ్యత వహించాలి. బీజేపీ తన దూకుడు విధానాలతో ప్రజలకు దూరమవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా కాంగ్రెసు కు పరిస్థితులు కలిసి వస్తాయని అందరూ ఆశిస్తున్నారు. కానీ అంతర్గత వర్గ విభేదాలు, ముఠాలతో అవకాశాలను పార్టీ చేజేతులారా దూరం చేసుకుంటోంది.