
స్థానిక ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితి లేదు
-ఆంధ్రప్రదేశ్లో అరాచక ప్రభుత్వం నడుస్తోంది
-రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది
-కన్నా లక్ష్మీనారాయణ
విజయనగరం, మార్చి 13
కేంద్ర హోం శాఖ, కేంద్ర ఎన్నికల సంఘం కల్పించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, జనసేన అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడం దారుణం. ఆంధ్రప్రదేశ్లో అరాచక ప్రభుత్వం నడుస్తోందని అయ న విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితి లేదని చెప్పారు. అరాచకాలు జరుగుతుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తూ చూస్తూ ఊరుకుంటోందని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర హోం శాఖ, కేంద్ర ఎన్నికల సంఘం కల్పించుకోవాలని ఆయన చెప్పారు. ఈ విషయంపై తాము కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన అభ్యర్థులు వేసిన నామినేషన్లను తిరస్కరించడం దారుణమైన విషయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ఆలయాల కోసం పోరాటం, హిందూ ఆలయాలు, భూముల పరిరక్షణకు బీజేపీ కచ్చితంగా పోరాడుతుందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యా సంస్థల అభివృద్ధికి మహారాజులు భూములిచ్చి ట్రస్టు ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. మాన్సాస్ ట్రస్టు విషయంలో జరిగిన పరిణామాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు.