.రాజస్థాన్లో ఘోర రోడ్డుప్రమాదం11 మంది మృతి
జైపూర్, మార్చి 14
రహదారులు నెత్తురోడుతున్నాయి. రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బలోత్రా - ఫలోడి హైవేపై వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి బొలెరో వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయింది. క్రేన్ సాయంతో ట్రక్కును పక్కకు తీశారు పోలీసులు. తమిళనాడులోని నామక్కల్లో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన విషయం విదితమే. నామక్కల్ వద్ద వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులను బీహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలోనూ ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. వోర్లీ సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, కారు నడుపుతున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.