తాడిపత్రిలో నువ్వా..నేనా…
అనంతపురం, మార్చి 14
రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటిసి ఎంపీటీసీ కార్పొరేషన్ మునిసిపాలిటీలకు నామినేషన్ పార్వము ముగిసింది. అనంతపురం జిల్లాలో పది మునిసిపాలిటీ ఒకటి కార్పొరేషన్ స్థానంకు ఎలెక్షన్స్ జరుగుతున్నాయి. తాడిపత్రి మునిసిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. అందులో 30వ వార్డు పైనే అందరి చూపు మాజీ ఎమ్మెల్యే వర్సెస్ స్టిట్టింగ్ ఎమ్మెల్యే మధ్య పోటీపైనే వుంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాడిపత్రి పట్టణంలోని 36 వార్డులో వైసీపీ టీడీపీల మధ్య ఎన్నికల వేడి రాజుకుంది . ఎన్నడూ లేని విధంగా ఎవరు ఊహించని విధంగా తాడిపత్రిలో రాజకీయం మలుపులు తిరుగుతోంది. 35 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయం చేసిన జేసీ బ్రదర్స్ ఓటమి లేకుండా గెలుపు పొందుతు వచ్చారు. తాడిపత్రిలో పార్టీ ఏదైనా ఎన్నికలు వస్తే చాలు జేసీ బ్రదర్స్ దే గెలుపు అన్న చందంగా వారి హవా నడిచింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు వైయస్ మిత్రుడిని పోటీలో దింపారు. వైసిపి పార్టీ తరఫున కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోటీల్లో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి దాదాపు 8 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొంది సంచలనం సృష్టించారు. ఎవరూ ఊహించని విధంగా ఓటమే లేదనుకున్న జేసీ బ్రదర్స్ కు కేతిరెడ్డి పెద్దారెడ్డి చెక్ పెట్టారు. వైసీపీ అధికారంలోకి రావడం తొమ్మిది నెలల పాలన పూర్తి కావడం వెంటనే మున్సిపల్ ఎన్నికలు రావడంతో వైసిపి టిడిపి మధ్య ఎలక్షన్ స్టంట్ మొదలైంది. పోటీనే లేదనుకున్న తాడిపత్రిలో నాటకీయ పరిణామాల మధ్య టిడిపి పార్టీ పోటీకి నిలిచింది. మొత్తం 36 వార్డులకు అభ్యర్థులను నిలిపారు. ఇదంతా ఒక ఎత్తయితే తాడిపత్రిలో కేవలం ఒక్క వార్డు గురించే పట్టణమంతా ప్రజలు విపరీతంగా చర్చించుకుంటున్నారు. అవార్డు అంత ప్రాధాన్యత రావడానికి రెండు పార్టీలకు సంబంధించి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు బరిలోకి దిగడమే దీనికి ప్రధాన కారణం. 30 వార్డులో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి నామినేషన్ వేయడంతో అందుకు పోటీగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అదే వార్డులో టిడిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ వార్డుకు సంబంధించి మహిళా ఓటర్లు 1222 పురుషులు 1220 మొత్తం 2 వేల నాలుగు వందల నలభై రెండు మంది ఓటర్లు ఉన్నారు. ఈ వార్డు 2014 వరకు ఊ ఎస్సీ రిజర్వేషన్ కింద అభ్యర్థులు నిలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి జనరల్ రిజర్వు కావడంతో ఈ వార్డు పైన అందరి దృష్టి పడింది. దాంతో ఒక్కసారిగా పట్టణమంతా ఆ అ వార్డు పై దృష్టి పెట్టింది. ఈ వార్డులో ఎవరు గెలుస్తారో అంటూ తాడిపత్రి పట్టణంలో ఏ నలుగురు గుమికూడిన ఇదే చర్చ జరుగుతుంది. ఫలితం రావాలంటే మాత్రం మార్చి 27తేదీ వరకు ఆగాల్సిందే.