
రేవంత్ రెడ్డికి ఉచ్చు బిగిసిపోయింది..
హైద్రాబాద్, మార్చి 14
ఎంపీ రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి వసూళ్ల రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఐకియా లాంటి సంస్థలపై కేసులు వేసి, హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఐకియాకు ప్రభుత్వ మద్దతు ఉందని, ఆ సంస్థ భయపడనక్కర్లేదని వ్యాఖ్యానించారు. బడా కంపెనీలపై కేసులు వేసి డబ్బు వసూలు చేయడం రేవంత్కు అలవాటైపోయిందని మండిపడ్డారు. గోపన్ పల్లి భూ వ్యవహారం సహా మంత్రి కేటీఆర్ ఫాంహౌజ్పై డ్రోన్లను అక్రమంగా తిప్పినందుకు రేవంత్ రెడ్డికి ఉచ్చు బిగుసుకుందని, ఇక ఆయన తప్పించుకోలేడని వ్యాఖ్యానించారు.కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ ఫాం హౌజ్ ఉన్న స్థలంలో రేవంత్ రెడ్డి అక్రమంగా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రేవంత్ రెడ్డితో పాటుగా మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. ఎయిర్ క్రాఫ్ట్ చట్టం కింద కేసులు పెట్టారు. రేవంత్ రెడ్డిని పోలసులు అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నారు.ఈ కేసులో బెయిల్ కోసం రేవంత్ రెడ్డికి హైకోర్టును ఆశ్రయించారు. అంతకుముందు ఆయన బెయిల్ పిటిషన్ను మియాపూర్ కోర్టు తిరస్కరించింది. హైకోర్టులో ఆయన కేసు విచారణ కోసం దిగ్గజ లాయర్ సల్మాన్ ఖుర్షీద్ హైదరాబాద్ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ కూడా అయిన ఈయన యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు న్యాయశాఖ మంత్రిగానూ పనిచేశారు.