
జగన్ సర్కార్కు షాకిచ్చిన ఎన్నికల సంఘం..
విజయవాడ, మార్చి 14
ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీని వెంటనే నిలిపివేయాలని.. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్కుమార్ ఆదేశించారు. ఎన్నికల నియామావళి అమలులో ఉందని, ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలు చేపట్టొద్దని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. అధికారులందరూ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని.. పట్టాల పంపిణీకి సంబంధించి టెండర్లు పిలవడం..టోకెన్ల పంపిణీ వంటివి చేపడితే చర్యలు తీసుకుంటామన్నారుఏపీ ప్రభుత్వం ఈ నెల 25న (ఉగాది రోజున) రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని భావించింది. రాష్ట్రవ్యాప్తంగా స్థలాలను గుర్తించి ఏర్పాట్లు చేస్తోంది. ఉగాది రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. దీంతో స్థలాల పంపిణీపై సందిగ్థత కొనసాగింది.. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది.ఇళ్ల పంపిణీ ఓటర్లను ప్రలోభపెట్టేలా ఉండటంతో నిలుపుదల చేయాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. అలాగే పంపిణీపై హైకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు మార్గదర్శకాలను సైతం పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల కమిషనర్ ప్రభుత్వం చేపట్టాల్సిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని నిలుపుదల చేయాలని నిర్ణయించారు.