జగన్ కు ఎందుకంత కోపం
విజయవాడ, మార్చి 16
నిమ్మగడ్డ రమేష్ కుమార్….. నిన్న మొన్నటి వరకూ ఆయన పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ నేడు జగన్ మీడియా సమావేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సుపరిచితులయ్యారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకూ మీడియా ముందుకు రాలేదు. అనేక సమస్యలు వచ్చినా.. విమర్శలు వచ్చినా జగన్ రెస్పాండ్ కాలేదు. కానీ ఈరోజు ఉదయం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకుని వెంటనే జగన్ మీడియా ముందుకు వచ్చారు. లోకల్ బాడీ ఎన్నికలను వాయిదా వేయడంపై మీడియా ఎదుటకు వచ్చారు.నిజానికి జగన్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై జగన్ ఆగ్రహానికి అనేక కారణాలున్నాయి. ఇందులో ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటం. ఇంకో పదిహేను రోజుల్లో ఎన్నికలు పూర్తయితే ఇక పూర్తి స్థాయి అభివృద్ధిపై దృష్టి సారించాలని జగన్ భావించారు. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అనేక చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జరగాల్సి ఉంది.స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల గ్రాంటు లభిస్తుంది. నిజానికి ఈ గ్రాంటు కోసమే జగన్ ఎన్నికలకు తొందరపడ్డారు. ఐదువేల కోట్ల రూపాయలు అంటే ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇది పెద్దమొత్తమే అవుతుంది. అందుకనే హడావిడిగా జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆరు వారాలు వాయిదా పడటంతో ఇక కేంద్రం నుంచి వచ్చే గ్రాంటు రానట్లేనని చెప్పుకోవాలి.మరోవైపు చంద్రబాబు వ్యూహం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడాన్న అభిప్రాయంలో జగన్ ఉన్నారన్నారు. అందుకే జగన్ ఎన్నికల కమిషనర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన సామాజిక వర్గం గురించి ప్రస్తావించారు. చంద్రబాబు నియమించిన నిమ్మగడ్డ రమేష కుమార్ అంటూ మాట్లాడటం వెనక ఆ సామాజికవర్గం ఇంకా తనను వెంటాడుతూనే ఉందన్న ఆలోచనలో జగన్ ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం మీద జగన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మండిపడటం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.మరో వైపు జగన్ తనపై చేసిన ఆరోపణలకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకే ఇళ్ల పట్టాల పంపిణీని నిలిపివేశారన్నారు. హైకోర్టు న్యాయమూర్తితో సమానంగా ఎన్నికల సంఘాన్ని చూడాలన్నారు. నిబంధనల ప్రకారమే తాను ఎన్నికలను వాయిదా వేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకే ఎన్నికలను వాయిదా వేశామన్నారు. కరోనా వైరస్ ప్రభావంపై కేంద్ర ప్రభుత్వం తమకు తెలియజేసిందన్నారు. ఎన్నికల సంఘంపై దురుద్దేశ్యాలను ఆపాదించడం సరికాదన్నారు. ఆరు వారాల్లో తిరిగి ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో జరిగిన హింసకు సంబంధించి అనేక పార్టీల నుంచి ఫిర్యాదులు రావడంతో అధికారులను బదిలీ చేశామన్నారు.