రాజోలులో జనసేన ఎంపీటీసీ ఏకగ్రీవం
కాకినాడ, మార్చి 16
ఏపీలో స్థానిక సంస్థల వేడి కనిపిస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు నామినేషన్లు ప్రక్రియ పూర్తికాగా.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగిసింది. ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రభావంతో ఎన్నికల్ని ఆరు వారాల పాటూ వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాల హడావిడి కనిపించింది.. ఎక్కువ స్థానాలను అధికార పార్టీ వైఎస్సార్సీపీ గెలుచుకుంది. టీడీపీ, జనసేన పార్టీలకు అక్కడక్కడా ఏకగ్రీవాలు దక్కాయి. ఇదంతా పక్కన పెడితే.. స్థానిక ఎన్నికలవేళ జనసైనికులు సంతోషంగా ఉన్నారట. అదేంటని ఆశ్చర్యపోకండి.. దీని వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది. జనసేన ఏకైక ఎమ్మెల్యే నియోజకవర్గంలో జనసైనికులకు కొంచెం ఊరట కలిటింగిదట. కీలకమైన గ్రామంలో ఎంపీటీసీ ఏకగ్రీవం కావడంతో ఖుషీ అవుతున్నారు. అదేంటి ఒక్క ఏకగ్రీవానికేనా ఇంతగా సంతోషపడాలా అనుకోకండి.. ఈ ఊరికి ఓ ప్రత్యేకత కూడా ఉందట. సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని అందరితో పంచుకుంటున్నారు జనసైనికులు.ఓ జనసైనికుడు తన ట్వీట్లో తన సంతోషాన్ని అందరితో పంచుకున్నాడు. 'అయ్యా రాపాక, నీ రాజోలు నియోజకవర్గంలో జనసేన అత్యధిక మెజార్టీ ఇచ్చిన రామరాజులంకలో జనసేన పార్టీకి ఎంపీటీసీ ఏకగ్రీవ ఎన్నిక జరిగింది, ఇప్పటికైనా అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ చరిష్మా లేకపోతే మీరు లేరు అని, ఇక మీరు పాలాభిషేకాలు చేసుకోండి, మీ (గన్) అన్నకి' అంటూ ఓ జనసైనికుడు ఘాటుగా ట్వీట్ చేశాడు. ఆయన వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చినా.. నియోజకవర్గంలో జనసైనికులు మాత్రం పార్టీకి అండగా నిలిచారని.. 2019 ఎన్నికల్లో కూడా ఈ గ్రామంలో జనసేనకు మెజార్టీ ఓట్లు వచ్చాయని.. ఇప్పుడు మళ్లీ ఏకగ్రీవం కావడంతో ఆనందంగా ఉందంటున్నారు జనసైనికులు. ఆ గ్రామంవైపు రాపాక వరప్రసాదరావును వెళ్లొద్దని సూచిస్తున్నారు.తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్సీపీ అభ్యర్ధులకు బీఫామ్లు అందించే కమిటీలో రాపాక కీలకంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అమలాపురం వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనూరాధ.. రాజోలు వైసీపీ ఇన్ ఛార్జ్ పెదపాటి అమ్మాజీ.. వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావుతో కలిసి బీఫామ్లు ఇచ్చారని సోషల్ మీడియాలో జనసైనికులు మండిపడ్డారు. నిజమైన రాజోలు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆలోచించాలని.. ఇంకా వీళ్ళకి మద్ధతు ఇస్తారా.. ప్రాంతం మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా.. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. ఓటుతో బుద్ది చెప్పండి అంటూ ఓ జనసేన పార్టీ కార్యకర్త పోస్ట్ పెట్టారు. వీడియోలను కూడా వైరల్ చేశారు.రాపాక వరప్రసాదరావు జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.. ఇక అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ నేతుల, జనసైనికులతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పేరుకే జనసేన పార్టీలో ఉన్నా.. జగన్కే జై కొట్టారు. పవన్ అమరావతి ముద్దు అంటుంటే.. రాపాక మాత్రం వద్దూ అంటున్నారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి బహిరంగంగానే మద్దతు పలికారు. అంతేకాదు తాను జనసేన పార్టీకి దూరంగా లేను.. దగ్గరగా లేను అంటున్నారు. పవన్ కళ్యాణ్.. తాను ఈ మధ్య కాలంలో కలవలేదని.. తనకు పార్టీ నుంచి ఎటువంటి సమాచారం రాలేదని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి జనసైనికులు రాపాకపై మండిపడుతున్నారఇటు పవన్ కళ్యాణ్ కూడా రాపాక వరప్రసాదరావు విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. అసలు ఎమ్మెల్యే తన పార్టీలో ఉన్నారో లేరో కూడా అర్ధం కాని పరిస్థితి ఉందని స్వయంగా ఆయనే వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా రాపాకపై జనసైనికులు పవన్కు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ మాత్రం రాపాక వ్యవహారంపై అంత సీరియస్గా తీసుకోవడం లేదు. గతంలో కూడా రాపాకను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఫేక్ లెటర్ వైరల్ కాగా.. జనసేన స్పందించింది. తాము ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. మరి వరప్రసాదరావు వ్యవహారంపై పవన్ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.