YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పీసీసీ ఛీఫ్ గా రేవంత్..?

పీసీసీ ఛీఫ్ గా రేవంత్..?

 

పీసీసీ ఛీఫ్ గా రేవంత్..?
హైద్రాబాద్, మార్చి 17
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరవేసిన కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కొనసాగుతున్నారు. ఈ వ్యవహారంలో రేవంత్ తో పాటు పలు సెక్షన్ల కింద ప్రభుత్వం కేసులు బుక్ చేసిన వారిలో ఐదుగురికి బెయిల్ దక్కింది. ఒక్క రేవంత్ కి మాత్రం ఇప్పటికే ఒకసారి మియాపూర్ కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరించగా.. శుక్రవారం రోజు హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేశారు.దీనిపై శుక్రవారం సాయంత్రమే విచారణ మొదలు కాగా ఈ కేసులో పలు కీలక అంశాలు లోతుగా పరిశీలించాల్సి ఉందని ప్రభుత్వం లాయర్లు మరికొంత సమయం కోరారు. ఇక రేవంత్ తరపున ఢిల్లీ నుండి వచ్చిన సల్మాన్ ఖుర్షీద్ లాయర్ల బృందం చాలా చిన్న కేసుగా పేర్కొనడంతో కోర్టు సోమవారం ఈ కేసులు తేల్చేస్తామని తుది తీర్పు ఇవ్వనున్నామని పేర్కొంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తిగా మారింది.వారం క్రితం మియాపూర్ కోర్టులో పిటిషన్ దాఖలు సమయంలోనే బెయిల్ వస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్పుడు చర్లపల్లి జైలుకి భారీగా తరలి వచ్చారు. ఇటు ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ ప్రాంతం.. జిల్లా నుండి.. అతిపెద్దదైన రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి నుండి అభిమానులు, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ విడుదల కోసం చర్లపల్లి జైలు వద్దకు క్యూకట్టారు. పోలీసులు అప్పుడు ఎక్కడిక్కడ కట్టడి చేసేందుకు ప్రయత్నించారు.ఇక ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తిగా మారింది. దీంతో పాటు రాష్ట్ర పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ దాదాపుగా ఖరారయ్యారన్న సమాచారం అందిందన్న ప్రచారం కూడా కొనసాగుతుంది. రేవంత్ పీసీసీ పదవిపై స్పష్టత వచ్చిన తర్వాతనే అధిష్టానం రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించి అభిప్రాయ సేకరణ చేశారని.. అప్పుడే లాయర్ల బృందాన్ని హైదరాబాద్ పంపించారని ప్రచారంలో ఉంది.ఒకపక్క కర్ణాటకలో డీకే శివకుమార్, ఢిల్లీలో అనిల్ చౌదరికి పగ్గాలు అప్పగించిన అధిష్టానం దూకుడు స్వభావం కలిగిన నేతలకే ఇక ప్రాధ్యానత ఇస్తున్నట్లుగా సూచనలు ఇచ్చేసింది. రాహుల్ గాంధీ దృష్టిని ఎన్నికలకు ముందే ఆకర్షించిన రేవంత్ అప్పుడు సీనియర్లలో అసంతృప్తి వచ్చే కారణంగా పీసీసీ బాధ్యతలకు దూరమయ్యారని కథనాలు వచ్చాయి.అయితే, ఇక ఇప్పుడు మాత్రం గత ఐదేళ్ల కాలంలో అధికార టీఆర్ఎస్ పార్టీ మీద అలుపెరగక పోరాటం చేస్తున్న రేవంత్ కి పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా మళ్ళీ రెపరెపలాడే అవకాశం ఉందని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. రేవంత్ డ్రోన్ కేసులు.. రిమాండ్ వ్యవహారం లేకుంటే కర్ణాటకతో ఢిల్లీతో పాటు తెలంగాణ చీఫ్ ను ప్రకటించేదని తెలుస్తుంది. రేవంత్ కు బెయిల్ దక్కే అవకాశాలు ఉన్నాయని రాజకీయ, న్యాయ వర్గాలు అంచనా వేస్తుండగా రేవంత్ బయటకు వచ్చిన తర్వాత పీసీసీ చీఫ్ పదవిపై ఢిల్లీ నుండి ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకపక్క బీజేపీ రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను నియమించి బలమైన ప్రణాళికలు రూపొందిస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఇక ఆలస్యం చేసే ఉద్దేశ్యంలో లేనట్లుగా కనిపిస్తుంది. మరి సోమవారం ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.

Related Posts