ఒక్కొక్కరుగా వదిలిపోతున్నారు...
కనిపించని 40 ఇయర్స్ అనుభవాలు
విజయవాడ, మార్చి 19
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పార్టీపై పట్టుకోల్పోతున్నారా? నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీని సరైన దిశలో నడిపించలేక పోతున్నారా? అంటే.. తాజా పరిణామాలను గమనిస్తున్న వారు ఔననే అంటున్నా రు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి దెబ్బ కొడితే పని జరుగుతుందో ఖచ్చితంగా అదే పనిచేస్తున్నారు సీఎం, వైసీపీ అధినేత జగన్. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీని బలహీన పరచాలనే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్న వైసీపీ నాయకులు అదే విధంగా ముందుకు సాగుతున్నారు. అయితే, ఈ వ్యూహాలను తిప్పికొట్టే ప్రయత్నం కానీ, పైఎత్తులు వేసే ఆలోచన కానీ చంద్రబాబు చేయలేకపోవడం గమనార్హం.కొన్ని రోజుల నుంచి వరుస పెట్టి టీడీపీ ఖాళీ అవుతోంది. ఈ జిల్లా ఆ జిల్లా అని కాకుండా అన్ని జిల్లాల్లోనూ నాయకులు సైకిల్ దిగిపోతున్నారు. వీరిలో ఫార్టీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ అనుభవం ఉన్న నాయకులు చంద్రబాబుకు మిక్కిలి స్నేహితులు కూడా ఉండడం గమనార్హం. రాజకీయాల్లో పార్టీల మార్పు అనేది సహజమే. ఎవరికి నచ్చిన పార్టీలో వారు ఉంటారు. ఎవరికి నచ్చిన జెండా వారు పట్టుకుంటారు. అయితే అనూహ్యంగా టీడీపీలో సంస్థాగతంగా ఉన్న కరణం బలరామ కృష్ణమూర్తి వంటివారు కూడా పార్టీ నుంచి బయటకు రావడం, అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆయన సైకిల్ దిగిపోవడం చర్చకు దారితీస్తోందిఅదేవిధంగా పులివెందులలో జగన్పై ఇంకా చెప్పాలంటే దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీపై పోరాడి ఓడిన సతీష్ రెడ్డి కూడా పార్టీకి దూరం కావడం చర్చకు దారితీస్తోంది. ఇక, విశాఖలోనూ పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల సమయంలోనే పార్టీకి దూరమయ్యారు. ఇలాంటి పరిణామాలు ఒక వైపు చంద్రబాబును ఇబ్బంది పెడుతుంటే.. మరోవైపు పార్టీ నుంచి బయటకు వస్తున్న నాయకులు చంద్రబాబు పై చేస్తున్న విమర్శలు మరింతగా ఆయన నాయకత్వానికి గొడ్డలి పెట్టుగా మారాయి.ఇక కర్నూలులో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ సైతం పార్టీని వీడడంతో పాటు బాబుపై తీవ్ర విమర్శలు చేశారు. మరో నాలుగేళ్లపాటు రాష్ట్రంలో పార్టీని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఉంది. అయితే ఇప్పటికే చాలా జిల్లాల్లో పార్టీ ఖాళీ అయిపోయింది. ఇప్పటికే గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. ఇక ఉన్న 20 మందిలో గంటా లాంటి వాళ్లను నమ్మే పరిస్థితి లేదు. అంతేకాదు, చంద్రబాబు వ్యూహాలు వేస్ట్ అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాలకు సమీక్ష అవసరం అనే మాట వినిపిస్తోంది. తనకు తాను మేధావినని చెప్పుకొనే చంద్రబాబు ఈ నాలుగేళ్లలో స్వయంకృతాలను చర్చకు పెట్టుకోకపోతే.. పార్టీ మరింతగా తిప్పలు పడతారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.