మంత్రి పదవుల కోసం ఆశలు
విజయవాడ, మార్చి 19
ద్దరు మంత్రులు ఇక రాజీనామా చేయక తప్పదు. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయనున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల రాజీనామాకు ఎంతో దూరం లేదు. ఇద్దరూ రాజ్యసభకు ఎన్నిక కావడం ఖాయం అవ్వడంతో మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. వీరి స్థానంలో జగన్ ఎవరిని తీసుకోనున్నారు? మంత్రివర్గంలోకి ఇద్దరిని తీసుకుంటారా? లేక ఇతర మంత్రులకు ఆ బాధ్యతలను అప్పగిస్తారా? అన్న చర్చ జరుగుతోంది.శాసనమండలి రద్దు అవుతుందన్న ధీమాలో జగన్ ఉన్నారు. కొంత ఆలస్యమయినా మండలి రద్దు గ్యారంటీ అని జగన్ కు ఢిల్లీ నుంచి సంకేతాలు ఉన్నాయి. అందుకే ఆయన మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు రాజ్యసభ పదవి ఇచ్చారు. వాస్తవానికి తర్వాత ఖాళీ అయినప్పుడు ఇద్దరికీ ఇవ్వాలని జగన్ భావించారట. అయితే శాసనమండలి రద్దు ఎంతో దూరంలో లేదని జగన్ కు తెలియడంతో ఆయన వెంటనే వారికి రాజ్యసభ అవకాశం ఇచ్చారని చెబుతున్నారు.ఇందులో పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలకమైన రెవెన్యూ శాఖ మాత్రమే కాకుండా ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. బోస్ రాజీనామాతో మరొకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. జగన్ అదే సామాజిక వర్గాల వారికి మంత్రి పదవి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పొన్నాడ సతీష్ కుమార్, గుంటూరు జిల్లాకు చెందిన విడదల రజనీలు ఉన్నారు. విడదల రజనీ తొలిసారి ఎమ్మెల్యే కావడంతో ఆమెకు ఛాన్స్ దక్కదంటున్నారు.ఇక పార్టీలో సీనియర్ నేతగా, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా కొలుసు పార్థసారధి ఉన్నప్పటికీ ఆయన సామాజిక వర్గానికి చెందని అనిల్ కుమార్ ఇప్పటికే మంత్రి వర్గంలో ఉన్నారు. దీంతో ఈయనకు ఈసారి అవకాశం లేనట్లేనని తెలుస్తోంది. బీసీల్లో ఎక్కువమంది కొత్తగా ఎన్నికయిన వారే కావడంతో సామాజికవర్గాన్ని పక్కన పెట్టి ఆ రెండు శాఖలను ఇతరులతో భర్తీ చేస్తారన్న వాదన కూడా విన్పిస్తుంది. మొత్తం మీద రెండు మంత్రిపదవులపైన పెద్ద ఆశలే అనేకమంది ఆశావహులు పెట్టుకున్నారు. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.