కరోనాతో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం
న్యూఢిల్లీ, మార్చి 29
కేంద్ర ప్రభుత్వం శరవేగంగా విస్తరిస్తూ వస్తున్న కరోనా వైరస్ను కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. కోవిడ్ 19 వల్ల ఇప్పటికే గ్లోబల్ ఎకానమీపై ప్రతికూల ప్రభావం పడింది. మార్కెట్లన్నీ కుప్పకూలాయి. ఎన్నో ఏళ్ల నాటి నుంచి పొందిన లాభాలన్నీ ఇప్పుడు హరించుకుపోయాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు ఆర్థిక అంశాలకు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించాలి.భయపడటం వల్లనో లేదంటే బాధపడటం వల్లనో ఎలాంటి ప్రయోజనం ఉండదు. హఠాత్తుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. దీని వల్ల దీర్ఘకాలంలో మీపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. ఇలాంటి కష్టకాలంలో సాధారణంగా చాలా మంది వారి ఆర్థిక అంశాలకు సంబంధించి తప్పులు చేస్తూ ఉంటారు. ఏ ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుంద్దాం.1. ఎమర్జెన్సీ ఫండ్ గురించి చాలా మంది వినే ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ఫండ్ను కచ్చితంగా కలిగి ఉండాలి. కనీసం ఆరు నెలలకు సమానమైన వేతనాన్ని ఎమర్జెన్సీ ఫండ్గా ఏర్పాటు చేసుకోవాలి. అనుకోకుండా ఉద్యోగం పోయినప్పుడు, మెడికల్ ఎమర్జెన్సీ లేదంటే ఇతర ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ సమయాల్లో ఈ ఫండ్ మీకు బాసటగా నిలుస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే కచ్చితంగా ఏర్పాటు చేసుకోండి. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ వంటి వాటిల్లో ఈ డబ్బు దాచుకోవచ్చు. బడ్జెట్ను కచ్చితంగా ఫాలో కావాలి. బడ్జెట్ను మెయింటెన్ చేయకపోతే అది మీ తప్పే అవుతుంది. ఖర్చులపై నియంత్రణ ఉండాలి. దీని కోసం బడ్జెట్ రూపొందించుకోండి. పెద్ద పెద్ద కొనుగోళ్లకు దూరంగా ఉండండి. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత వీటిని కొనుగోలు చేయొచ్చు. అద్దె, ఈఎంఐ, నిత్యావసర సరుకులు, యుటిలిటీ బిల్లులు, మెడిషన్స్ వంటి వాటికి ముందు ప్రాధాన్యం ఇవ్వండి. వీటి తర్వాతనే దేనికైనా ఖర్చు చేయండి. అది కూడా అవసరం అనుకుంటేనే. లేదంటే వద్దు.ఇటీవల కాలంలో చాలా మంది సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లు కూడా పడిపోయాయి. దీంతో మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీ కూడా దిగొచ్చింది. తగ్గాయి కదా అని భయపడి సిప్ అపోద్దు. సిప్ ఇన్వెస్ట్మెంట్లను కొనసాగించండి. దీంతో రూపీ కాస్ట్ యావరేజ్ వల్ల మీకు ప్రయోజనం లభిస్తుంది. అలాగే సిప్ ఇన్వెస్ట్మెంట్లను వెనక్కి తీసుకోవద్దు. మీరు బ్యాంకులకు ఏమైనా ఈఎంఐ వంటివి చెల్లించాల్సి ఉంటే.. ఆఫ్లైన్ కట్టడం ఇప్పుడు కష్టం కావొచ్చు. అందువల్ల బ్యాంకులను సంప్రదించి ఆన్లైన్ పేమెంట్కు అవకాశం ఉందేమో తెలుసుకోండి. లేదంటే లేట్ పేమెంట్ ఫీజు భరించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు మూడు నెలల ఈఎంఐ మారటోరియం నడుస్తోంది. అయితే మీ బ్యాంక్ నుంచి మీకు ఎలాంటి సందేశాలు రాకపోతే మాత్రం అకౌంట్లలో ఈఎంఐ కటింగ్ సరిపడ డబ్బులు కలిగి ఉండేలా చూసుకోండి. లేదంటే పెనాల్టీలు పడొచ్చు.