కొనసాగుతున్న బంగారం పతనం
ముంబై, మార్చి 30
బంగారం ధర పరుగుకు బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర ఈరోజు మాత్రం పడిపోయింది. భారీగానే దిగొచ్చింది. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగినా కూడా మన దేశంలో మాత్రం పసిడి ధర పడిపోవడం గమనార్హం. ఇకపోతే వెండి ధర కూడా తగ్గింది.హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర పతనమైంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.1925 తగ్గుదలతో రూ.43,375కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ.1940 తగ్గుదలతో రూ.39,830కు క్షీణించింది.పసిడి ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.1910 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.39,500కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర పెరిగింది. 1650 డాలర్ల పైకి చేరింది. పసిడి ధర ఔన్స్కు 0.18 శాతం పెరుగుదలతో 1657.30 డాలర్ల వద్ద కదలాడుతోంది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం తగ్గింది. వెండి ధర ఔన్స్కు 0.15 శాతం తగ్గుదలతో 14.51 డాలర్లకు దిగొచ్చింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి ధర భారీగానే తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1150 తగ్గుదలతో రూ.41,410కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1490 క్షీణతతో రూ.43,710కు పడిపోయింది. ఇక కేజీ వెండి ధర రూ.1910 తగ్గుదలతో రూ.39,500కు క్షీణించింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి