వేసవి ఎఫెక్ట్ తెలంగాణలోని సాగు-తాగునీటి లభ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే మెదక్ జిల్లాలో నీటికి సమస్యలు మొదలయ్యాయి. వేసవి ముదిరితే ఇబ్బంది మరింతగా పెరిగిపోవచ్చని అంతా భయపడుతున్నారు. మరోవైపు భూగర్భజలాలు గణనీయంగా క్షీణించిపోయాయి. దీంతో వ్యవసాయ క్షేత్రాలకు నీరు పూర్తి స్థాయిలో ఉండదని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎండల తీవ్రత, నీటి ఎద్దడి కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. ఈ సమస్య మరింతగా పెరిగిపోయే అవకాశాలున్నాయి. ఇక తాగునీటికీ ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. పలు గ్రామాల్లోని ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. స్థానికంగా భూగర్భ జల మట్టం శాతం దిగజారిపోవడమే కారణంగా నిపుణులు చెప్తున్నారు. జిల్లాలోనే నీటి మట్టాలు జనవరిలోనే తగ్గుముఖం పట్టాయి. ఇటీవలిగా పరిస్థితి మరింత క్షీణించింది. ఊహించని విధంగా జల మట్టాలు తగ్గిపోయాయి.
జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో భూగర్భ జలాలు క్షీణించాయి. 30 నుంచి 37 మీటర్ల లోతుకు చేరాయి. వర్షాలు తగినంతగా లేకపోవడంతో సమస్య మరింతగా పెరిగిపోతోంది. ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత అసాధారణంగా ఉండడంతో నీరు పాతాళానికి చేరుతోందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉండగా పది మండలాల్లో 20 మీటర్ల లోతుకు పడిపోయాయని అంటున్నారు. భూగర్భ జలాలు క్షీణించడంతో బోర్ల కింద సాగుచేసిన వరిపంటలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. నిత్యం సగటును 38 నుంచి 40 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అవుతుండటం.. భూగర్భ జలాలు మరింత లోతుకు చేరడం వల్ల సమస్య తీవ్రమవుతోంది. దీంతో ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి సాగునీటి కొరత తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.