మూడు నెలల కరెంట్ బిల్లులపై మినహాయింపు
హైద్రాబాద్, మార్చి 30
కరోనా వైరస్ దెబ్బకి దేశం మొత్తం లాక్ డౌన్లోకి వెళ్లిపోయింది. కోవిడ్ 19 వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. అన్ని రంగాలు చితికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ రూ.1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఆర్బీఐ కూడా పలు కీలక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది.అందులో భాగంగానే కరెంటు బిల్లు చెల్లింపులకు సంబంధించి అన్ని రాష్టాలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ఎలక్ట్రిసిటీ బిల్లు పేమెంట్స్పై కూడా 3 నెలలు మారటోరియం విధించాలని కోరింది. కేంద్రం అదే సమయంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్కు కూడా ఆదేశాలు జారీ చేసింది. జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ కంపెనీలు 3 నెలలు మారటోరియం ఊరట కలిగించాలని తెలిపింది. భవిష్యత్ పవర్ కొనుగోలుకు సంబంధించి పేమెంట్ సెక్యూరిటీ మొత్తాన్ని సగానికి తగ్గించాలని, లేట్ పేమెంట్స్పై నో చార్జీలు వంటి ప్రయోజనాన్ని కలిగించాలని పేర్కొంది.లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లిక్విడిటీ సమస్యలను ఎదుర్కోంటున్నారని, అందువల్ల డిస్కమ్స్కు కూడా డబ్బులు చెల్లించలేకపోవచ్చని తెలిపింది. అలాగే డిస్కమ్స్ చెల్లింపులు చేయలేకపోయినా కూడా జనరేటింగ్ అండ్ ట్రాన్స్మిషన్ కంపెనీలు వాటికి పవర్ సప్లై చేయాలని సూచించింది. అలాగే కరెంట్ కట్ లేకుండా నిరంతరం ప్రజలకు విద్యుత్ అందేలా చూడాలని కోరింది.కాగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. భారత్లో ఇప్పటికే దీని వల్ల మరణించిన వారి సంఖ్య 20 దాటేసింది. ఇప్పటికే 1100 మందికి పైగా కోవిడ్ 19 సోకింది. అదే అంతర్జాతీయంగా చూస్తే కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 31 వేలకు పైగానే ఉంది. 7 లక్షల మందికి ఈ వైరస్ సోకింది.