విదేశాల నుంచి వచ్చిన వాళ్ల దగ్గర నుంచే కరోనా
న్యూఢిల్లీ, మార్చి 30
ఇప్పటి వరకూ దేశంలో నమోదైన కరోనా వైరస్ కేసుల్లో ఎక్కువ శాతం విదేశాల నుంచి వారే ఉన్నారు. దీంతో, ఇలాంటి వారి గురించి అధికారులు ఇంటింటికి వెళ్లి ఆరాతీస్తున్నారు. కేరళలో శుక్రవారం 39 కేసులు నిర్ధారణ కాగా, ఒక్క కాసర్గఢ్లోనే 34 బయటపడ్డాయి. వీరంతా గల్ఫ్ దేశాల నుంచి వచ్చినవారిగానే గుర్తించారు. ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి కేరళకు వచ్చిన వారిలో దాదాపు 70 మంది కాసర్గఢ్ జిల్లాల్లోనే ఉన్నారు. ఇక్కడ ఒకే రోజు 34 కేసులు బయటపడటంతో హై రిస్క్ ప్రాంతంగా ప్రకటించారు. ఈ ప్రాంతంలో ప్రజలు వైరస్ బారినపడే అవకాశం ఉందని కేరళ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి తొలివారంలో స్వదేశానికి వచ్చిన వీరంతా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నుంచి తప్పించుకున్నారు.కేవలం చైనా, దక్షిణ కొరియా, ఇరాన్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ నుంచి వచ్చే ప్రయాణికులపై మాత్రమే దృష్టిసారించిన అధికారులు.. వీరిని పట్టించుకోలేదు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చేవారికి కూడా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని మార్చి రెండో వారం తర్వాత ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో అప్పటి వరకూ దుబాయ్, సౌదీ అరేబియా లాంటి దేశాల నుంచి వచ్చివారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించలేదు. దీని ఫలితంగానే గత పది రోజుల నుంచి పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని వీరికి వైరస్ సంక్రమించినట్టు గుర్తించారు.మహారాష్ట్రకు చెందిన 40 మందితో కూడిన బృందం ఆరు రోజుల పర్యటనకు దుబాయ్, అబుదాబి వెళ్లొ తిరిగొచ్చింది. వీరిలో ఇప్పటి వరకూ 15 మందిలో కరోనా వైరస్ నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. ఫిబ్రవరి 20 నుంచి కాసర్గఢ్ జిల్లాకు వచ్చిన 6,511 మంది ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉండగా, వీరిలో 127 మందిని ఐసోలేషన్లో ఉంచారు. రాబోయే రోజుల్లో మరింత మందిని ఐసోలేషన్కు తరలించేవారి సంఖ్య పెరుగుతుందని, 215 మంది ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు వివరించారు.మధ్య ఆసియా దేశాల నుంచి వచ్చినవారిని మార్చి తొలివారం నుంచే స్క్రీనింగ్ చేసుంటే పరిస్థితి మరింత అదుపులో ఉండేదని వైద్య నిపుణులు అంటున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్తారని, వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండే ప్రదేశాల్లో ఇది కూడా ఒకటిని డాక్టర్ సుమంత్ రామన్ అనే వైద్య నిపుణుడు వ్యాఖ్యానించారు. మార్చి 1న ముంబై చేరుకున్న దాదాపు 300 మంది కేరళవాసులను అబ్జర్వేషన్లో ఉంచారు.మహారాష్ట్రలోని ప్రస్తుతం నమోదైన కరోనా కేసుల్లో సింహభాగం అంతర్జాతీయ పర్యటనకు వెళ్లొచ్చివారే. వీరిలో ఎక్కువ మంది యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ నుంచి వచ్చినవారేనని మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 122 కేసుల్లో 67 మంది విదేశీ పర్యటనకు వెళ్లినవారు కాగా, వీరిలో 28 మంది యూఏఈలో పర్యటించినవారే.