కనిపించని జనసేన మహిళలు...
ఏలూరు, ఏప్రిల్ 1
ఏపీలో ఉవ్వెత్తున ఎగిసిన జనసేన పార్టీ తాలూకు విభాగాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే యువసేన తాలూకు జాడలు కనిపించడం లేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రారంభించిన పార్టీలో జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించి, తెలివైన చాకులాంటి యువతను యువసేనగా అప్పాయింట్ చేసుకున్నారు. ఎన్నికల సమయంలో వీరిని ఐటీ సహకారంగా వాడుకున్నారు. అయితే, ఎన్నికల్లో ఘోరపరాజయం కారణంగా ఈ వింగ్ను ఎత్తేశారు. దీంతో దాదాపు వేలాది మంది యువసేన కార్యకర్తలు బయటకు వచ్చారు.వీరంతా కూడా జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన సచివాలయాల్లో వలంటీర్లుగా సెక్రటరీలుగా ఉద్యోగాలు పొంది వాటిలో నిమగ్నమయ్యారు. ఇక, సీనియర్లు, వృద్ధులు మాత్రమే పార్టీలో ఉన్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వీర మహిళ కాన్సెప్ట్ కూడా ఇదే తరహాలో నిర్వీర్య మైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు వీర మహిళ అనే విభాగం ఏర్పాటు చేశారు పవన్ కల్యాణ్. ఈ క్రమంలో అన్ని జిల్లాల నుంచి చదువుకున్న మహిళలను ఈ విభాగంలో భాగస్వామ్యం చేశారు.పార్టీకి మహిళలను ఆకర్షించే క్రమంలో వీర మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా వ్యవహరించాలని పవన్ కల్యాణ్ హితోపదేశం కూడా చేశారు. దీంతో మహిళా శక్తికి పవన్ కొత్త రక్తం నింపారంటూ ఆయనపై ఓ వర్గం మీడి యా పొగడ్తల వర్షం కురిపించింది. అయితే, ఈ విభాగం కూడా ఎన్నికల తర్వాత ఎక్కడా కనిపించక పోవడం గమనార్హం. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే అయినా విభాగాలు మాత్రం పనిచేస్తాయి. కానీ, వీటికి భిన్నంగా జనసేనలో మాత్రం వీర మహిళ వీరత్వం ఎక్కడా కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.అప్పుడప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అవుతున్నా.. వీర మహిళ విభాగంతో ఆయన భేటీ అయినట్టు ఎక్కడా కనిపించడం, వినిపించడం కూడా లేదు. దీంతో అసలు ఈ విభాగం ఉందో.. లేదో ఆ పార్టీ వాళ్లకే తెలియడం లేదు. ఇక జిల్లా స్థాయిలో అప్పుడప్పుడు మీటింగ్లు పెడుతున్నా కూడా నాయకులు ఎక్కడా తమ జేబుల్లో నుంచి పైసా తీయడం లేదట. కార్యకర్తలతో మీరు అక్కడ కార్యక్రమం ఏర్పాట్లు చూడండి.. మేం వచ్చి మాట్లాడతాం అని చెపుతున్నారట. దీనిని బట్టి జనసేనలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ? అర్థమవుతోంది.