ఉమ్మడి సహాయ పథకాన్ని ప్రకటించాలి
కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ డిమాండ్
న్యూఢిల్లీ ఏప్రిల్ 2
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం వల్ల అన్ని రంగాల ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ అన్నారు. గురువారం నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియాగాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ మేరకు ఆమె మట్లాడుతూ.. ముందస్తు ప్రణాళిక లేకుండా ఆకస్మాత్తుగా లాక్డౌన్ విధించడం వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజలను ఆదుకునేందుకు కనీస ఉమ్మడి సహాయ పథకాన్ని ప్రకటించాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మనముందు భారీ సవాల్ ఉన్నదని, కానీ దాన్ని అధిగమించాలంటే, మనం మరింత పట్టుదలతో ఉండాలన్నారు. కోవిడ్19 మహమ్మారి వల్ల మన దేశంలో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, వెనుకబడిన వర్గాల పరిస్థితి కూడా అయోమయంగా ఉందన్నారు. అందరం కలిసి వీరందరినీ ఆదుకోవాలని సోనియా పిలుపునిచ్చారు. పేదలకు కావాల్సిన మద్దతు ఇవ్వాలన్నారు. అప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నట్లు ఆమె చెప్పారు. ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా పాల్గొన్నారు. లాక్డౌన్ అవసరమే అయినా.. లక్షలాది మంది వలస కూలీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కరోనా వైరస్ రోగులను నయం చేసేందుకు ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని సోనియాగాంధీ కోరారు. వైరస్ ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని పరికరాలు, కిట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. లాక్డౌన్ వల్ల నష్టపోతున్న కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలను ప్రకటించాలని ఆమె అన్నారు. రైతులకు ముఖ్యమైన పంట కోతలు, కొత్త పంటలు వేసుకునే సమయం కాబట్టి రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి ఆమె సూచించారు.