కరోనాకు మతం లేదు
పూణె, ఏప్రిల్ 3
దేశంలో కరోనా వైరస్ ఒక్కసారిగా పెరిగిపోవడానికి ఓ వర్గమే కారణమనే ప్రచారం జోరుగా సాగుతున్నవేళ దీనిపై స్పందించిన సద్గురు జగ్గీవాసుదేవన్.. ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్క మతానికో, వర్గానికో అంటగట్టడం సరికాదని, దీని పేరుతో సమాజంలో విద్వేషాలను సృష్టించవద్దని సూచించారు. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తికి ఒక నిర్దిష్ట వర్గం, మతానికి సంబంధం లేదని, ఇలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దని వాసుదేవన్ కోరారు. కరోనా వైరస్కు వ్యతిరేకంగా దేశం చేపట్టిన యుద్ధంలో భాగం కావడానికి ప్రయత్నించాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ వీడియోను సద్గురు పోస్ట్ చేశారు.‘వైరస్కు కులం, మతం తెలియదు. మతం ఆధారంగా సమాజంలో విభజనలను సృష్టించడం ద్వారా మన సమస్యలను పరిష్కరించలేం. వైరస్ వ్యాప్తి చెందకుండా చేపట్టిన చర్యలకు ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలి. ఐక్యంగా కోవిడ్-19 ఎదుర్కొందాం.. #BeatTheVirus హ్యాష్ ట్యాగ్తో వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధితో పోరాడుతున్నాం.. ఈ సమయంలో కుల, మత, వర్గ విభేదాలు సృష్టించడం సరికాదు.. ఈ తరుణంలో ప్రజలందరూ ఒకటిగా నిలబడి ఈ మహమ్మారి పెద్ద విపత్తుగా రూపాంతరం చెందకుండా చూడాలని పిలుపునిచ్చారు.కరోనా వైరస్ వ్యాప్తికి ప్రత్యేక మతమో, వర్గమో కారణమని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని, ఇలాంటి వాటి వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. దేశంలో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పెరగడానికి ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భవన్లో మార్చి 1 నుంచి 15 వరకు నిర్వహించిన మత ప్రార్థనల్లో పాల్గొన్న తబ్లీగ్ జమాత్ ప్రతినిధులే కారణం కావడంతో దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సద్గురు స్పందించారు. అయితే, దేశంలో గత మూడు రోజుల నుంచి వెలుగుచూసిన మొత్తం కేసుల్లో 65 శాతం తబ్లీగ్ జమాత్ ప్రార్థనలకు హాజరైనవారే కావడం గమనార్హం.