ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నును ఏప్రిల్ మాసంలో ముందస్తుగా చెల్లించి 5శాతం రిబేట్ పొందేందుకుగాను ప్రవేశపెట్టిన ఎర్లీబర్డ్ పథకంలో అధికమొత్తంలో ఆస్తిపన్నును సేకరించాలని జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను సేకరణలో గత సంవత్సరం కన్నా రూ. 121కోట్లు అధికంగా సేకరించి రికార్డు సృష్టించిన జీహెచ్ఎంసీ గత సంవత్సరం ఎర్లీబర్డ్లో సేకరించిన రూ. 368 కోట్ల కన్నా అధికమొత్తంలో సేకరించనున్నది. ప్రస్తుత 2018-19 ఆర్థిక సంవత్సర ఆస్తిపన్నును ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించిన వారికి ఐదు శాతం రాయితి ఇవ్వనున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి నేడు ప్రకటించారు. ఈ ఐదు శాతం రాయితి కేవలం 2018-19 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను చెల్లిపుపై మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుత సంవత్సరం ఆస్తిపన్నును జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని అన్ని సిటీజన్ సర్వీస్ సెంటర్లు, మీ-సేవా, ఇ-సేవా కేంద్రాలు, ఆన్లైన్లోనూ ఎంపిక చేసిన బ్యాంకు బ్రాంచీలలోగాని, మైజీహెచ్ఎంసీ మొబైల్ యాప్ ద్వారాగాని ఏప్రిల్ 6వ తేదీ నుండి చెల్లించవచ్చని వివరించారు. ఈ ఎర్లీబర్డ్ పథకం కింద గత ఆర్థిక సంవత్సరం 2017-18లో రూ. 368.30కోట్లు రాగా 2016-17లో రూ. 212 కోట్లు, 2015-16లో రూ. 161.38కోట్లు,2014-15లో రూ. 119.94కోట్లు, 2013-14లో రూ. 109కోట్లు, 2012-13లో రూ. 30కోట్లు లభించాయని తెలిపారు. అయితే ఈ ఎర్లీబర్డ్ పథకం గత సంవత్సర బకాయిలు లేనివారికే వర్తిస్తుందని పేర్కొన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరం ముగింపు దృష్ట్యా జీహెచ్ఎంసీ సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రక్రియ అవుతున్నందున ఎర్లీబర్డ్లో ఆస్తిపన్ను చెల్లింపులను ఏప్రిల్ 6 వ తేదీ తర్వాత స్వీకరించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
టౌన్ ప్లానింగ్ ద్వారా రూ. 814కోట్లు
2017-18 ఆర్థిక సంవత్సరంలో భవన నిర్మాణ అనుమతులు, భూ క్రమబద్దీకరణ కింద మొత్తం రూ. 814కోట్లు లభించాయని కమిషనర్ తెలిపారు. భవన నిర్మాణ అనుమతులలో భాగంగా 2017-18లో రూ. 647.02కోట్లు, ఎల్.ఆర్.ఎస్ పత్రాల జారీ వల్ల రూ. 167.04కోట్లు లభించాయని అన్నారు. 2016-17లో భవన నిర్మాణాల అనుమతులకు రూ. 525.53కోట్ల ఆదాయం రాగా, 2017-18లో అదనంగా రూ. 121కోట్లు లభించాయని, దీనికి కారణం భవన నిర్మాణ అనుమతుల్లో ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టి 20రోజుల్లోనే అనుమతులు జారీచేయడమని వివరించారు.