ప్రత్యక్ష పన్ను వసూళ్లలో మంచి పురోగతి కనబడింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాథమిక లెక్కలను కేంద్రం విడుదల చేసింది. దాని ప్రకారం 2017-18లో 6.84 కోట్ల మంది ఆదాయపు పన్ను రిటర్నులను ఫైల్ చేశారు. అదే అంతకుముందు సంవత్సరం కేవలం 5.43 కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేశారు. 2016-17 సంవత్సరంతో పోలిస్తే గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్నుల ఫైలింగ్ 26% వృద్దిని కనబరిచింది. ఎక్కువ మంది కొత్తగా(మొదటిసారి) రిటర్నులు ఫైల్ చేయడం వల్లే ఈ పురోగతి కనబడ్డట్లు తెలుస్తోంది.2017-18 ఆర్థిక సంంవత్సరంలో మార్చి 30 నాటికి కొత్తగా ఐటీ రిటర్నులు ఫైల్ చేసినవారి సంఖ్య 99.49 లక్షలకు పెరిగింది. అదే 2016-17లో కొత్తగా ఐటీ రిటర్నులు ఫైల్ చేసిన 85.51లక్షలతో పోలిస్తే 16.3% వృద్ది కనబడినట్లు లెక్క. ఇంకా 2017-18 సంవత్సరంలో ఐటీ రీఫండ్లు దాదాపు 1.49 లక్షల కోట్లకు చేరాయి. నాలుగు ఆర్థిక సంవత్సరాల నుంచి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్యలో స్థిరమైన వృద్ది నెలకొంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2013-14లో దాఖలైన మొత్తం ఆదాయపు పన్ను రిటర్నుల సంఖ్య 3.79 కోట్లతో పోలిస్తే 2017-18 సంవత్సరంలో ఐటీ రిటర్నులు దాకలు చేసిన వారి సంఖ్య 80.5% పెరిగి 6.84 కోట్లుగా నమోదైంది. ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయని వారిని గుర్తించి వారికి ఈ-మెయిళ్లు, ఎస్ఎంఎస్, నోటీసులు పంపడం ద్వారా, కరపత్రాలు, ప్రకటనలు వంటి వాటి ద్వారా పన్ను చెల్లింపుదారులను ఐటీ శాఖ అప్రమత్తం చేయడం మూలంగానే ఐటీ రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. చట్టంలో నిర్మాణాత్మక మార్పులు చేయడం, పన్ను చెల్లింపుదార్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల ప్రయత్నాలు చేయడం వంటివి కూడా ఇందుకు దోహదం చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటనలో తెలిపింది.