నన్నపనేని రాజకుమారి కు దారేదీ
గుంటూరు, ఏప్రిల్ 10
సీనియర్ రాజకీయ దిగ్గజం, మహిళా నేతగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకురాలు నన్నపనేని రాజకుమారి. కాంగ్రెస్తో రాజకీయాలు ప్రారంభించిన ఆమె టీడీపీలో సుదీర్ఘ కాలంగా చక్రం తిప్పుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆమె ఎమ్మెల్సీగా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్గా కూడా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆమె రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నారనే వ్యా ఖ్యలు టీడీపీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఆమె తన కుమార్తె నన్నపనేని సుధను టీడీపీ బాట పట్టించలేక పోవడంతో పార్టీలో హవా తగ్గిపోయిందని కూడా ఓ వాదన ఉంది. గతంలో వినుకొండ నియోజకవర్గం నుంచి నన్నపనేని రాజకుమారి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత అదే పార్టీ నుంచి సత్తెనపల్లిలో కూడా ఓ సారి గెలిచారు.అనంతరం మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో నన్నపనేని రాజకుమారి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి పార్టీలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆమెకు తెలుగు మహిళ అధ్యక్షురాలి పదవిని కూడా ఇచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ మహిళా హక్కుల సంఘం చైర్ పర్సన్గా నియమించారు. నన్నపనేని రాజకుమారి రాజకీయంగా తన సత్తా చూపించారనే చెప్పాలి. మంచి వాగ్దాటి, ప్రత్యర్థి పార్టీలు, నేతలపై పదునైన విమర్శలు చేయడంలో ఆమె తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించేవారు. ఎక్కడా వివాదాలకు తావివ్వకుండా ముందుకు దూసుకుపోయారు.2009 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా కూడా ఆమె తనకు ఏ పదవి ఇవ్వకపోతే పార్టీ నుంచి వెళ్లిపోతానని చంద్రబాబును బెదిరించారు. చివరకు చంద్రబాబు సైతం నన్నపనేని రాజకుమారి బెదిరింపులకు తలొగ్గి ఆమెకు సంక్లిష్ట పరిస్థితుల్లోనూ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక 2014 ఎన్నికల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చాక ఆమెకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చారు. తన వరకు ఓకే అయినా.. తన కుమార్తె సుధను టీడీపీలోకి తెచ్చుకోవడంలో విఫలమయ్యారు. ఆమె వైసీపీ బాట పట్టారు. పైగా 2014 ఎన్నికల్లో నన్నపనేని రాజకుమారి కుమార్తె వినుకొండ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు.దీంతో టీడీపీలో సహజంగానే నన్నపనేని రాజకుమారి హవా తగ్గింది. ఇక, ఇప్పుడు మండలి కూడా రద్దు కానుండడం, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కూడా లేకపోవడంతో ఆమె దాదాపు రాజకీయాలకు బై చెప్పారనే అంటున్నారు పరిశీలకులు. అయితే, పార్టీలో క్రియాశీలంగా ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే రాజధాని అమరావతి ఆందోళనలకు ఆమె ప్రత్యక్ష మద్దతు ప్రకటించారు. మహిళలకు అండగా నిలిచారు. ఇప్పటికీ.. ఆమె యాక్టివ్గానే ఉన్నా.. ప్రత్యక్ష రాజకీయాల నుంచి మాత్రం వైదొలిగిపోయారనే ప్రచారం మాత్రం జరుగుతుండడం గమనార్హం. మరి ఆమె కుమార్తె సుధ వైసీపీలో ఉన్నా ( ఆమె భర్తది రెడ్డి సామాజికవర్గం) ఆమెను ఆ పార్టీలో పట్టించుకునే వారే లేరు.