YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

 కరోనా భయంతో మొబైల్ టవర్లకు నిప్పు

 కరోనా భయంతో మొబైల్ టవర్లకు నిప్పు

 కరోనా భయంతో మొబైల్ టవర్లకు నిప్పు
లండన్, ఏప్రిల్ 10
పెన్‌డ్రైవ్‌, సీడీలు లేదా ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్లు, మొబైళ్లకు వైరస్ వ్యాపిస్తుందని తెలుసు. అవి కరోనా వైరస్ కూడా వ్యాప్తి చేస్తాయా? ఈ ప్రశ్న చాలా వింతగా ఉంది కదా. ఇదిగో యూకే ప్రజల్లో ఏర్పడిన ఈ సందేహమే ఇప్పుడు విధ్వంసాలకు కారణమైంది. సోషల్ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులు చేసిన ప్రచారాన్ని నమ్మిన ప్రజలు మొబైల్ టవర్లను టార్గెట్ చేసుకున్నారు. ఇప్పటివరకు పదికి పైగా మొబైల్ టవర్లను ధ్వంసం చేశారు. ఆయా వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోలేక ఇబ్బందిపడుతున్న ప్రభుత్వానికి ఈ ఘటనలు పుండు మీద కారం చల్లినట్లుగా మారాయి.కరోనా వైరస్ వల్ల అమెరికాతోపాటు యూకే, ఐరోపా దేశాలు విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. కరోనాను అడ్డుకొనేందుకు ఆయా దేశాల్లో కూడా లాక్‌డౌన్ విధించి ప్రజలు బయటకు రాకుండా చూస్తున్నారు. అయితే, యూకేలోని పలు ప్రాంతాల్లో ప్రజలు 5G మొబైల్ టవర్లపై దాడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు కొత్త తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అలా ప్రవర్తించడానికి కారణం ఏమిటీ? ఏం జరిగింది? సిగ్నల్ టవర్లను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు?4G కంటే మరింత మెరుగైన నెట్‌వర్క్ అందించేందుకు యూకేలోని మొబైల్ సంస్థలు 5G సేవలను అందుబాటులోకి తెచ్చాయి. అయితే, ఈ అత్యాధునిక టెక్నాలజీకి కరోనా వైరస్‌ను సైతం ఆకర్షించే శక్తి ఉంటుందని, ఈ సిగ్నల్స్ ద్వారా కోవిడ్-19 వ్యాపిస్తోందని కొందరు ప్రచారం చేశారు. ప్రపంచంలో చోటుచేసుకుంటున్న కరోనా వైరస్ మరణాలకు 5G మొబైల్ నెట్‌వర్క్ కారణమని పేర్కొన్నారు. ఈ వదంతులు నమ్మిన ప్రజలు 5G మొబైల్ టవర్లపై దాడులు చేయడం మొదలుపెట్టారు. వాటిని తగలబెడుతున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.ఆకతాయిలు ధ్వంసం చేస్తున్న మొబైల్ టవర్లకు మరమ్మతులు చేయడానికి వెళ్తున్న నెట్‌వర్క్ సిబ్బందిపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఓ మహిళ ఫైబర్ నెట్‌వర్క్ ఉద్యోగిపై చేసిన దాడి వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో ఈ వీడియోను 2.4 మిలియన్ మంది వీక్షించారు. మరోవైపు టవర్లకు నిప్పు పెడుతున్న వీడియోలు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లలో కూడా వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో యూకే ప్రభుత్వం అప్రమత్తమైంది.గత వారం రోజులుగా జరుగుతున్న ఈ దాడులు మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలను బెంబేలెత్తిస్తున్నాయి. వొడాఫోన్, ఈఈతోపాటు మరో మూడు సంస్థల 5G నెట్‌వర్క్ టవర్లు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో మొబైల్ సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా కరోనా వైరస్ చాలా సులభంగా ప్రజలకు వ్యాపిస్తుందనే ప్రచారంతో బర్మింగ్‌హమ్, లివర్‌పూల్‌లో దాడులు మొదలయ్యాయి.ఈ ఘటనలను ఖండిస్తూ యూకే మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. 5జీ నెట్‌వర్క్ ద్వారా వైరస్ వ్యాపిస్తుందనే ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని, ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితం కాలేదని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి వదంతులు నమ్మవద్దని కోరారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ నిబంధనలను కఠినతరం చేసింది. 5జీ టవర్లను కాలుస్తున్న వీడియోలను తొలగిస్తోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు కూడా ఆయా వీడియోలను, అసత్య ప్రచారాలను తొలగించాలని అధికారులు ఆదేశించారు.5జీ మొబైల్ నెట్‌వర్క్‌తో కరోనా వైరస్ వ్యాపిస్తుందనే ప్రచారం పూర్తి అవాస్తవమని నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) స్పష్టం చేసింది. కరోనా వైరస్ కేవలం మనుషి నుంచి మనిషికి లేదా బాధితుడు తాకిన వస్తువుల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని తెలిపారు. కొంతమంది సెలబ్రిటీలు కూడా ఆలోచన లేకుండా ఇలాంటి అసత్య ప్రచారానికి మద్దతు పలుకుతున్నారని, ఇలాంటి సందర్భాల్లో బాధ్యతయుతంగా ఉండాలని పేర్కొన్నారు. చూశారుగా.. మొబైల్ నెట్‌వర్క్‌ల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందనేది పూర్తిగా అవాస్తవం. ఇలాంటి ఫేక్ వార్తలు మీకు చేరినట్లయితే వెంటనే ఖండించండి. పోలీసులకు ఫిర్యాదు చేయండి.

Related Posts