బాబు విమర్శలను పట్టించుకోని జనం
ఏలూరు, ఏప్రిల్ 11
రాజకీయాల్లో విశ్వాసం అనేది ముఖ్యం. ప్రజల నమ్మకం పొందిన నేత మనగలుగుతారు. తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉండే వారినే ప్రజలు విశ్వసిస్తారు. 2004 ముందు చంద్రబాబు వేరు. ఆ తర్వాత వేరు. అంతకు ముందు చంద్రబాబు ఉచిత పథకాలకు వ్యతిరేకంగా ఉండేవారు. ప్రజలు కష్టపడి పనిచేయాలని భావించేవారు. కానీ 2004 నుంచి చంద్రబాబు కూడా రాజకీయాల్లో రాటుదేలిపోయి ఉచిత పథకాలను ప్రకటిస్తూ వస్తున్నారు. అయినా వరసగా పదేళ్ల పాటు అధికారానికి చంద్రబాబు దూరమయ్యారు.ఇక 2014 ఎన్నికల నాటికి వచ్చే సరికి చంద్రబాబు ఊహించని విధంగా హామీలు ఇచ్చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు వంటివి ఇందులో కీలకం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారు. కొత్త రాష్ట్రం ఏర్పడటం వల్ల కావచ్చు. విభజనతో వల్ల వచ్చిన ఇబ్బందులు కావచ్చు. ఏది ఏమైనా చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో చివరి నిమిషంలో మేల్కొని వాటిని అమలు పర్చేందుకు ప్రయత్నించారు. కానీ ప్రజలు మాత్రం చంద్రబాబును నమ్మలేదు.పసుపు కుంకుమ వంటి పథకాలు ఎన్నికలకు ముందు ఇచ్చినా అవి వర్క్ అవుట్ కాలేదు. ఇలా చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న విమర్శలను కూడా జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. రైతుల పట్ల, వైద్యుల పట్ల చంద్రబాబు చూపిస్తున్న జాలిని వారు నమ్మడం లేదు. ఇది రాజకీయ ఎత్తుగడగానే ప్రజలు భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని అనేక వర్గాలు చంద్రబాబు కరోనా సమయంలో నీతులు చెబుతున్నా పట్టించుకోవడం లేదు.ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయన్న సినీ కవి మాటలు చంద్రబాబు విషయంలో అక్షరసత్యాలుగా మారాయి. ఎమ్మెల్యేల ను పార్టీలోకి తీసుకోవడం నుంచి మంత్రి పదవులు ఇవ్వడం వరకూ చంద్రబాబు చేసిన పనులు ప్రజలు గుర్తుంచుకోవడంతోనే ఆయన మాటలను ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు. కరోనా సమయంలో ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలకు కూడా పెద్దగా స్పందన కన్పించకపోవడానికి కారణం చంద్రబాబు విశ్వసనీయతను కోల్పోవడమేనని చెప్పక తప్పదు