ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ న్యాయమూర్తి కనగరాజు
విజయవాడ ఏప్రిల్ 11
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ న్యాయమూర్తి కనగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటి వరకూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించిన ప్రభుత్వం ఆయనకు శుక్రవారం ఉద్వాసన తెలిపిన సంగతి విదితమే. ఉదయమే విజయవాడలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఈసీగా నియమితులైన కనకరాజు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా దాదాపు తొమ్మిదేళ్లపాటు పని చేశారు. 1972లో మద్రాస్ యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1973లో సేలం బార్ అసోసియేషన్ సభ్యుడిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సీనియర్ సిటిజన్స్ కేసులు సత్వరం పరిష్కరించిన రికార్డ్ ఈయనకుంది. వివిధ కమిషన్లలో కూడా సభ్యుడిగా కనగరాజు వ్యవహరించారు. కాగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ హోదాలో రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమించేలా ఆర్డినెన్స్ను ప్రభుత్వం తీసుకు వచ్చింది. సదరు ఆర్డినెన్స్ ప్రకారం జస్టిస్ వి.కనగరాజ్ నియామకం జరిగింది. కొత్త కమిషనర్గా జస్టిస్ కనగరాజు పేరును ప్రతిపాదిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్కు పంపిన పైల్ను గవర్నర్ ఆమోదించడంతో ఆయన నియామకం ఖరారైంది. ఫలితంగా ఈ ఉదయం ఆయన ఎస్ఈసీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో జస్టీస్ కనగరాజ్ విద్య, బాలలు, మహిళల, వృద్ధుల సంక్షేమ అంశాలకు సంబంధించి కీలక తీర్పులు ఇచ్చారు.