ఇంకా మండుతున్న ఈసీ ఇష్యూ
విజయవాడ, ఏప్రిల్ 13
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసేట్లు లేదు. కరోనా కంటే ఇప్పుడు ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు హాట్ టాపిక్ గా మారింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయం ప్రస్తుతం హైకోర్టుకు చేరింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం సోమవారం హైకోర్టు విచారించనుంది. అయితే ఇప్పుడు విపక్షాలకు గవర్నర్. రాష్ట్ర ఎన్నికల అధికారి కనగరాజ్ టార్గెట్ గా మారారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను వదిలేసి ఇప్పుడు టీడీపీ నేతలు వీరిద్దరిపై పడటం చర్చనీయాంశంగా మారింది.రెండు రోజుల క్రితం జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తప్పించి ఆయన స్థానంలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కనగరాజ్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఆయన పదవీ బాధ్యతలను కూడా స్వీకరించారు. అయితే టీడీపీ నేతలు కనగరాజ్ కు ఎలా పదవి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా 65 ఏళ్ల వయస్సున్న వారిని నియమించాల్సి ఉంది. అయితే 70 ఏళ్ల కనగరాజ్ ను ఎలా నియమిస్తారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.ఇక కనగరాజ్ ను క్వారంటైన్ కు ఎందుకు పంపలేదన్న ప్రశ్నలు కూడా టీడీపీ నేతలు వేస్తున్నారు. తమిళనాడు నుంచి వచ్చిన 70 ఏళ్ల వ్యక్తిని రాష్ట్రంలోకి ఎలా అనుమతించారని, నిబంధనలు కనగరాజ్ కు వర్తించవా? అని టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి, ఆలపాట ిరాజేంద్ర ప్రసాద్ లాంటి నేతలు నిలదీస్తున్నారు. చంద్రబాబు ఏపీకి వస్తే క్వారంటైన్ కు పంపుతామన్న వైసీపీ నేతలు కనగరాజ్ ను ఎందుకు పంపలేదని ప్రశ్నిస్తున్నారు.ఈ వివాదంలోకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కూడా లాగుతున్నారు. అసలు ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ గవర్నర్ ప్రభుత్వం చెప్పినట్లే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరో వైపు కనగరాజ్ టీడీపీ సోషల్ మీడియాలో కనగరాజ్ అరబిందో ఫార్మా డైరెక్టర్ గోవిందరాజన్ మామ గారు ఈ కనగరాజ్ అని ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బావ డైరెక్టర్ గా ఉన్న కంపెనీ అరబిందో ఫార్మా అంటూ కనగరాజ్ ను టార్గెట్ చేస్తున్నారు. మొత్తం మీద ఏపీలో ఇప్పుడు కరోనా కంటే కనగరాజ్ విషయమే ప్రాధాన్యత అంశంగా మారింది.