అపత్కాలంలో ముందుకు రానీ సీఎం
విజయవాడ, ఏప్రిల్ 14
జగన్ గురించి ఏపీ జనాలకు ఇపుడే బాగా అర్ధమవుతోంది. ఆయన పది నెలల పాలనలో మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసింది కూడా ఈ మధ్యనే. అదీ ఒకటి రెండు మార్లు మాత్రమే. జగన్ ఎక్కువగా మాట్లాడరు అని అప్పట్లో పార్టీ నాయకులు చెబితే వినడమే తప్ప నిజాలు తెలియవు. కానీ ఇపుడు అనుభవపూర్వకంగా జనం అన్నీ అవగాహన చేసుకుంటున్నారు. జగన్ ఏ విషయంలోనూ భయపడరు, గట్టిగా నిలబడతారు , అదే సమయంలో ఆయన మనసులో ఉన్నదీ ఒక పట్టాన బయటపడదు, ఇక జగన్ కరోనా వంటి పెను విపత్తు వేళ కూడా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఓడిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎక్కడో పొరుగున ప్రవాసం చేస్తూ కూడా తెగ హడావుడి చేస్తున్నారు.ఈ నేపధ్యంలో ఏపీకి ముఖ్యమంత్రిగా ఇంకా చంద్రబాబే ఉన్నారా అన్న డౌట్లు కూడా చాలా మందికి వస్తున్నాయి. అయితే జగన్ మౌనం, బాబు గారి దూకుడు రెండూ బేరీజు వేసుకున్న తరువాత ఇక తాము రంగంలోకి దిగకపోతే తప్పదనుకున్నారో ఏమో తెలియదు కానీ వైసీపీ మంత్రులు ప్రతీ రోజూ మీడియా ముందుకు రావడం జగన్ బాగా పనిచేస్తున్నారు. మాకు అన్ని సలహాలూ ఆయనే ఇస్తున్నారు, ఆయన గంటల తరబడి కరోనా మీద సమీక్షలు చేస్తున్నారంటూ దండోరా వేస్తున్నారు. జగన్ ఎప్పటికపుడు అన్ని విషయాలు తెలుసుకుంటూ అందరినీ అప్రమత్తం చేస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు.అయితే ఈ విధంగా చెప్పడం వల్ల మంత్రులు తాము జగన్ కి మేలు చేశామనుకుంటున్నారో ఏమో కానీ అది రివర్స్ లో జనాలకు వెళ్తోందన్నది మరచిపోతున్నారు. జనాలకు ఎవరేం చేస్తున్నది ఒక అవగాహన ఉంటుంది. ఇక ప్రభుత్వంలో జగన్ మాటే చెల్లుతుంది కూడా. అయితే జగన్ మీడియా ముందుకు రాకుండా ఉంటే ఆయన అసలు పట్టించుకోలేదన్న భావన ఉంటుందని మంత్రులు ఇలా అన్నీ జగన్ సారే చేస్తున్నారంటూ సర్టిఫికేట్లు ఇవ్వడం వల్ల కొత్తగా ఒరిగేది లేదు కానీ జగన్ పని తీరు మీదనే మరో రకమైన భావన వచ్చే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. పైగా ఏ రోజు ఏ మంత్రి జగన్ సమీక్ష పెట్టలేదని చెప్పకపోతే ఆయన ఆ రోజు జగన్ అసలు పని చేయనట్లుగా కూడా తప్పుడు సంకేతాలు పోయే పరిస్థితీ ఉందని అంటున్నారు. అయినా పని చేసుకునే వారికి ప్రచారం అవసరమా అన్నది కూడా వైసీపీ మంత్రులు ఆలోచన చేస్తే మంచిదేమో కదా.ఓ వైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీకి మీడియాను ఎలా వాడుకోవాలో తెలుసు. మరో వైపు విపత్కర పరిస్థితుల్లో తెలంగాణా సీఎం కేసీయార్ కి కూడా మీడియా మేనేజ్ మెంట్ బాగా తెలుసు. వాళ్ళిద్దరూ అలా టీవీ చానళ్ళలో రెచ్చిపోతూంటే జగన్ మాత్రం అసలు కంటికి కనిపించడంలేదు. ఇది పూర్తిగా జనాలు వారితో జగన్ ని పోల్చుకునేందుకు అవకాశం ఇస్తోంది. మరో వైపు చంద్రబాబు దూకుడు చేస్తూ మీడియా మీటింగులు పెడుతున్నారు. దీంతో జగన్ ఈ కీలక సమయంలోనైనా జనాలకు కనిపిస్తే ఆ నిండుతనం భరోసా వేరుగా ఉంటుందన్నది వైసీపీ పెద్దలకు ఉంది. కానీ జగన్ తన రూటే సెపరేట్ అంటున్నారు. దాంతోనే మంత్రులు జగన్ ని ఇలా తమ మాటల ద్వారా జనంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా పనిచేసే వారికి కొత్తగా సర్టిఫికేట్లు అవసరం లేదు. ఏదో చేయబోయి మరేదో అయిందన్నట్లుగా మంత్రులు తమ వరకూ మాట్లాడుకుంటే సరిపోతుందేమో. జగన్ ప్రస్తావన ఒకటికి పది సార్లు మీడియా ఎదుటకు తెచ్చి అనవసరంగా ఆయన్ని ఇరికించేస్తున్నరేమో.