YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పీకల్లోతు కష్టాల్లో  హేమంత్ సోరెన్

పీకల్లోతు కష్టాల్లో  హేమంత్ సోరెన్

పీకల్లోతు కష్టాల్లో  హేమంత్ సోరెన్
రాంచీ, ఏప్రిల్ 15 
ముఖ్యమంత్రి అయి నాలుగు నెలలు కూడా కాలేదు. కరోనా చిచ్చు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. అసలే చిన్న రాష్ట్రం. పేద ప్రాంతం. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలన్నది ముఖ్యమంత్రికి సవాల్ గా మారింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆందోళన అంతా ఇంతా కాదు. కరోనా వ్యాప్తితో జార్ఖండ్ రాష్ట్రం కుదేలైపోయింది. ఆర్థిక వనరులన్నీ దెబ్బతిన్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్రం మరింత దిగజారిపోయింది. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి కూడా ప్రభుత్వానికి లేదు.దీంతో లాక్ డౌన్ పై ఆయన మల్లగుల్లాలు పడ్డారు. అఖిల పక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్నారు. లాక్ డౌన్ ను మరింత కాలం కొనసాగిస్తే రాష‌్ట్రం తట్టుకోలేదన్నది అన్ని పార్టీల అభిప్రాయం. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. జార్ఖండ్ లో కొంత కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదిగానే కన్పిస్తుంది. కేవలం 13 కేసులే ఇప్పటి వరకూ నమోదవ్వడంతో లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తివేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.దీనికి తోడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఏడు లక్షల మంది కార్మికులు బీహార్ తదితర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. వలస కార్మికులందరూ వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుని పోవడంతో హేమంత్ సోరెన్ పై వత్తిడి పెరిగింది. ఆ యా రాష్ట్రాలు వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ ఏడు లక్షలమంది కుటుంబాలు తమ వారిని రాష్ట్రానికి రప్పించమనే డిమాండ్ పెరిగింది. దీంతో హేమంత్ సోరెన్ లాక్ డౌన్ ను ఎత్తివేస్తే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు.ఇప్పటికే తమ రాష్ట్రానికి చెందిన కార్మికులు చిక్కుకుపోయినా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హేమంత్ సోరెన్ లేఖ రాశారు. తమ వారిని వీలుంటే రాష్ట్రానికి పంపమని కోరారు. తమ రాష్ట్రాన్ని ప్రత్యేక కోణంలో చూడాలని హేమంత్ సోరెన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాలని ఆయన కోరుతున్నారు. కొత్త సీఎం హేమంత్ సోరెన్ కు కరోనా రూపంలో చిక్కు వచ్చి పడినట్లయింది.

Related Posts