మరింత కఠినం
న్యూఢిల్లీ ఏప్రిల్, 15
ఏప్రిల్ 20వ తేదీ తర్వాత లాక్ డౌన్ కు మినహాయింపులు వచ్చే దాకా ఈ ఆరు రోజులు మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు జరిగేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్ క్యార్యదర్శి రాజీవ్ గౌబ ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అదే సమయంలో ఏప్రిల్ 20వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొన్ని మినహాయింపులకు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాలో రాజీవ్ గౌబ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. మే 3 దాకా లాక్ డౌన్ కొనసాగింపు వెనుక ఉద్దేశాలను వారితో పంచుకున్నారు. ఈ వారం రోజులు అత్యంత కఠినంగా లాక్ డౌన్ అమలైతే ఆ తర్వాత దేశంలో కరోనా ప్రభావం నియంత్రణలోకి వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను రాజీవ్ ప్రధాన కార్యదర్శులకు వివరించారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఇవ్వనున్న మినహాయింపులపై వీడియో కాన్ఫరెన్సులో చర్చించారు. వ్యవసాయం, వస్తు రవాణా, పరిశ్రమలు, గ్రామీణ నిర్మాణ రంగం, ఇరిగేషన్ నిర్మాణ పనులకు మినహాయింపులు ఇచ్చే అవకాశాలను వివరించారు.. అదే సమయంలో మినహాయింపుల ఇచ్చే రంగాల్లో ముందస్తుగా చేపట్టాల్సిన పనులను వీడియో కాన్ఫరెన్సులో చర్చించారు.