కరోనా రాజకీయ లెక్కల మతలబు
విజయవాడ, ఏప్రిల్ 16,
కరోనా లెక్కల విషయంలో ఏపీలో రాజకీయ రగడ రగులుకుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధికార పక్షం వైసీపీపైనా, సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేస్తోంది. దీంతో ఒక్కసారిగా అసలు ఏపీలో ఏం జరుగుతోందనే వాదన తెరమీదికి వచ్చింది. టీడీపీ వాదన చూస్తే.. ఏపీలో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ.. జగన్ ప్రభుత్వం దాచి పెడుతోందని అంటోంది. అంతేకాదు, కేవలం ఒకటి రెండు ప్రాంతాలకు మాత్రమే కరోనా బూచిని పరిమితం చేసి, మిగిలిన ప్రాంతాల్లో ఉన్నప్పటికీ దాచి పెడుతున్నట్టు టీడీపీ పేర్కొంది. అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తున్న వైసీపీ దీనికి అనుగుణంగానే ఇక్కడ అంతా కరోనా ఎక్కువుగా ఉందనే విధంగా బులిటెన్లను విడుదల చేస్తోందని టీడీపీ పేర్కొంటోంది. అంతేకాదు, విశాఖను రాజధాని చేయాలని అనుకున్న వైసీపీ అక్కడ ఏమీ లేదన్నట్టుగా వ్యవహరిస్తోందని కూడా విమర్శలు చేస్తోంది.ప్రస్తుతం గుంటూరులో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న మాట వాస్తవం. అదే సమయంలో విశాఖ విషయానికి వస్తే.. ఇక్కడ పెద్దగా కేసులు లేని మాటా వాస్తవం. అయితే, టీడీపీ దీనిని రాజకీయంగా వాడుకుని జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఏకైక ఉద్దేశంతో విమర్శలు చేస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. గుంటూరు విషయానికి వస్తే.. డిసెంబరులో జరిగిన ఢిల్లీ మర్కజ్కు వెళ్లివారు ఇక్కడ నుంచి ఎక్కువగా ఉన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తికూడా వెళ్లివచ్చారు. దీంతో ఆ వ్యక్తితో పాటు ప్రజాప్రతినిధిని కూడా పద్నాలుగు రోజుల క్వారంటైన్కు తరలించిన విషయాన్ని ఇప్పుడు గుర్తించాలి. నిజానికి ప్రభుత్వం దాచి పెట్టాలంటే.. తన పార్టీకి చెందిన కుటుంబం యొక్క వివరాలను దాచి పెట్టాలి కదా ? కానీ, అలా చేయడం మానేసి.. ఉన్నది ఉన్నట్టు చెప్పింది.ఇక, ప్రధానితో సీఎం వీడియో కాన్ఫరెన్స్లో జగన్ కేసుల సంఖ్యను తగ్గించి చెప్పారని టీడీపీ మరో వాదనను తెరమీదికి తెచ్చింది. ఇది కూడా అసంబద్ధమైన వాదనగానే మారింది. ఎందుకంటే.. టీడీపీ చెబుతున్నట్టు.. జగన్ ఏమీ అబద్దాలు ఆడలేదు. ఆయన ఉన్నది ఉన్నట్టే చెప్పారు. మోడీతో సమావేశం అయ్యేప్పటికి సీఎంకు అందిన లెక్క మేరకు 382 పాజిటివ్ కేసులు ఉన్నాయి. వీటినే ఆయన ప్రధానికి వివరించారు. ఇక, ఇది జరిగిన ఓ రెండు గంటలకు అంటే సాయంత్రం సమయానికి ఈ కేసుల సంఖ్య 402కు చేరింది. దీనిలో ఉన్న తేడా కేవలం 22 కేసులు. అంటే.. జగన్ 22 కేసులు దాచారన్నమాట! ఇది వాదనకు నిలబడే అంశమేనా? అనేది టీడీపీ నాయకులు ఆలోచించుకోవాలి.ఇక, విశాఖ విషయానికి వస్తే అక్కడ పెద్దగా మర్కజ్కు వెళ్లినవారు లేరు. అయితే ఏపీలో ముందు అక్కడ కరోనా ప్రబలుతుందని అందరూ అనుకుంటున్న టైంలో అక్కడ క్రమంగా కరోనాను కట్టడి చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల ద్వారా అక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది విస్తృతంగా జరిగింది కాదు. ప్రభుత్వ నియంత్రణ తర్వాత విశాఖలో పెద్దగా కేసులు నమోదు కాలేదు. అయితే, టీడీపీ మాత్రం ఇక్కడేమో మహోగ్రరూపం దాల్చిందని, దానిని కావాలనే జగన్ ప్రభుత్వం దాస్తోందని విమర్శలు చేయడం సమంజసంగా అనిపించడం లేదు. అయినా .. ఈ సమయంలోనూ రాజధానిని ముడిపెట్టి కరోనాను వినియోగించుకోవడం సమంజసమా ? అనేది తమ్ముళ్లు ఆలోచించుకోవాలి.