తండ్రి వారసత్వానికి దూరంగా బొజ్జల
చిత్తూరు, ఏప్రిల్ 17
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం శ్రీకాళహస్తి. ఇది టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గా ల్లో ఒకటి. ముఖ్యంగా ఒకే ఒక నాయకుడు ఇక్కడ పార్టీని అన్నీతానై నడిపించారు. ఆయనే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి. టీడీపీ తరఫున ఐదుసార్లు గెలిచిన నాయకుడుగా ఆయన గుర్తింపు పొందారు. మంత్రి కూడా చక్రం తిప్పారు. 2014లోనూ ఆయన టీడీపీ టికెట్ పై విజయం సాధించి మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే, అనారోగ్య కారణాలతో ఆయన పక్కకు తప్పుకొన్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది జరిగిన సార్వత్రిక పోరులో ఆయన కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి రంగంలోకి దిగారు. అయితే, ఈయన తన తండ్రి రాజకీయాలను అందిపుచ్చుకోలేక పోయారు.గత ఏడాది ఎన్నికల్లో హోరా హోరీ పోరు జరిగిన నేపథ్యంలో ఆయన ఓడిపోయారని అనుకున్నా.. పార్టీ పరంగా చూసుకున్నప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి దూకుడు అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి. తండ్రి మంత్రిగా ఉన్నప్పుడే ఆయన అనేక వివాదాలకు కేంద్రంగా మారారు. నిజానికి తండ్రి వారసత్వం అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన నాయకులకు గత ఏడాది జరిగిన ఎన్నికలు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. రాష్ట్రంలో వారసులు ఎక్కడా గెలిచి గుర్రం ఎక్కలేదు. అయితే, రాజకీయంగా మాత్రం ఒకరిద్దరు పట్టు సాధించారు. కానీ, మరింత మంది మాత్రం అలా పట్టు కూడా నిలుపుకోలేక పోతున్నారు.శ్రీకాళహస్తి విషయానికి వస్తే.. ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన బియ్యపు మధుసూదన్రెడ్డి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనా.. తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తికి నాన్ లోకల్ అయినా తన వ్యక్తి అయినా ఇక్కడ రాజకీయంగా దశాబ్దకాలానికి పైగా తిరుగులేని నేతగా ఉన్నారు. టీడీపీకి పూర్తిగా చెక్ పెట్టేశారు. టీడీపీ నుంచి కార్యకర్తలను తన పార్టీలోకి చేర్చుకోవడంలో బియ్యపు విజయం సాధించారు. ఆయన మాట తీరే ఆయన్ను ప్రజలకు దగ్గర చేసింది. మాస్లోకి బియ్యపు పేరు భారీగా వెళ్లిపోయింది. ఈ క్రమంలో టీడీపీలో ఉండే కార్యకర్త లు, అనుచరులు కూడా వచ్చి వైసీపీ గూటికి చేరుతున్నారు.ఇక నియోజకవర్గంలో మరో బలమైన నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎన్సీవి నాయుడు సైతం ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లడం కూడా టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ. ఇలాంటి పరిస్థితిని నిలువరించడంలోను, పార్టీని కాపాడడంలోను టీడీపీ నాయకుడిగా బొజ్జల సుధీర్ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ఆయన కష్టపడుతున్నా.. నాయకులను సంతృప్తి పరచలేక పోతున్నారు. అదే గోపాలకృష్ణా రెడ్డి ఉండి ఉంటే ఆయన అందరిని కలుపుకుని వెళ్లే తీరు వేరుగా ఉంటుదని అంటున్నారు. ఇక టోటల్గా చిత్తూరు జిల్లాలోనే టీడీపీ పరిస్థితి ఏమంత బాగోలేదని.. కాళహస్తిలో సుధీర్పై సానుభూతి ఉన్నప్పటికీ.. పార్టీ నిలబడే పరిస్థితి లేదని అందుకే తాము పార్టీలో ఇమడలేక పోతున్నామని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో బాబు ఇక్కడి రాజకీయాలను ఎలా సరిదిద్దుతారో ? చూడాలి.