YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

 కరోనాలోనూ... మద్యం కిక్కులు

 కరోనాలోనూ... మద్యం కిక్కులు

 కరోనాలోనూ... మద్యం కిక్కులు
నల్గొండ, ఏప్రిల్ 17
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించి దాని నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో అన్ని రకాల దుకాణాలు మూసి ఉంచాలని, వ్యక్తులు భౌతికదూరం పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా మద్యం దుకాణాలు, బార్‌అండ్‌రెస్టారెంట్‌లు సైతం మూసి ఉన్నాయి. కానీ లాక్‌డౌన్‌నూ మద్యం సరఫరా అవుతోంది. వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా రహస్య ప్రాంతాల్లో మద్యాన్ని నిల్వ ఉంచి సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం పట్టుబడింది. కాసిపేట, జన్నారం, తాండూర్‌ ప్రాంతాల్లో మద్యం కాటన్‌లు పట్టుబడ్డాయి. మద్యాన్ని సరఫరా చేస్తూ వ్యక్తులు సైతం అక్కడక్కడ దొరికారు. ఇలా లాక్‌డౌన్‌లోనూ వ్యాపారులు మద్యం సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం ధరలను అమాంతం పెంచి విక్రయిస్తున్నా మందుబాబులు ఎంతైనా సరే కొనుగోలు చేస్తున్నారు. గతానికి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ధరల్లో పోలిక కూడా లేదు. బెల్టు షాపుల నిర్వాహకులైతే ఇష్టం వచ్చిన ధరకు అమ్ముతూ మందుబాబుల జేబులు కొల్లగొడుతున్నారు.మద్యం రాకపై పలు అనుమానాలుగత నెల 23 నుండి రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. అప్పటి నుండి నిత్యావసర సరుకులకు, కూరగాయలకు మినహా ఏ దుకాణామూ తెరిచి ఉంచడానికి వీలు లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా మద్యం దుకాణాలు కూడా మూతబడ్డాయి. అయితే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ ప్రకటించి ఇప్పటికి 20 రోజులు దాటినప్పటికీ బెల్టు దుకాణాల్లో మద్యం లభ్యతపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించేవారు. పట్టుకున్న మద్యాన్ని ఎక్సైజ్‌ అధికారులకు అందించేవారు. కానీ ఇప్పుడు వారు ప్రత్యేక విధుల్లో ఉండడం వల్ల దీనిపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. ఎక్సైజ్‌ అధికారులు జిల్లాలో ఎక్కడా కూడా దాడి చేసిన సందర్భాలు లేవు. ఎక్కడి నుండైన సమాచారమొస్తే టాస్క్‌ఫోర్స్‌ బృందాలు దాడులు చేసి మద్యం నిల్వలు స్వాధీనం చేసుకుంటున్నాయి. అలా ఆదివారం తాండూర్‌ మండలంలో బీరు, లిక్కర్‌ కాటన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఏదేమైనా గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సరఫరాపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొన్నిచోట్ల మద్యం దుకాణాలు అర్ధరాత్రి పూట కొంత సమయం ఎవరికీ తెలియకుండా తెరుస్తున్నారని, త్వరగా పని చేసుకుని మూసేస్తున్నారని తెలిసింది. ఇదే జరిగితే ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడిచినట్లవుతుంది. ఎక్సైజ్‌ అధికారులు మాత్రం లాక్‌డౌన్‌ పీరియడ్‌ కంటే ముందుగా కొంత మంది వ్యక్తులు మద్యం స్టాక్‌ పెట్టుకున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related Posts