మరిన్నీ సడలింపులు
న్యూఢిల్లీ ఏప్రిల్ 17
కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రధాని మోదీ దేశంలో రెండోదశ లాక్డౌన్ ప్రకటించిన రెండోరోజే కొన్నింటికి మినహాయింపులు ఇస్తూ కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని సవరించి మరిన్నింటికి మినహాయింపు ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్భల్లా తాజాగా మరో స్టేట్ మెంట్ ఇచ్చారు. అన్ని శాఖలు, విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే నిర్మాణ పనులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులు, విద్యుత్ లైన్లు, టెలిఫోన్ లైన్లు, ఆప్టిక్ ఫైబర్ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన అన్ని కార్యకలాపాలకు తాజా మార్గదర్శకాలలో కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలకు, సహకార రుణ సంస్థలకు, తక్కువ సిబ్బందితో కార్యకలాపాలు సాగించే విత్త సంస్థలకు తాజా గైడ్ లైన్స్ లో లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. తాజా గైడ్ లైన్స్ లో గిరిజన ప్రాంతాల్లో జరిగే కార్యకలాపాలకు మినహాయింపు ఇచ్చారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, పంటల సాగు, కలప సేకరణ వంటివి వ్యవసాయ సంబంధిత కార్యకలాపాల్లో చేర్చారు. సుగంధ ద్రవ్యాలు సాగు..కొబ్బరి, వెదురు, కోకో, సుగంధ ద్రవ్య దినుసుల సాగు, శుద్ధి చేయడం, ప్యాకేజి, మార్కెటింగ్, అమ్మకాలు వంటి కార్యకలాపాలకు తాజాగా మినహాయింపు ఇచ్చారు.