గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్ కార్పోరేషన్ కు చెందిన వివిధ విభాగాలకు సంబంధించి హైకోర్టు, సిటీ సివిల్ కోర్టు ఇతర కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారం కోసం డిజిటల్ ఫార్మట్లోకి రావాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.పూర్తిగా మ్యాన్వల్ ఫైళ్ల నిర్వహణ ఉండడం వల్ల జీహెచ్ఎంసీ లీగల్ విభాగం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. కోర్టుల్లో దాదాపు 8వేలకు పైగా కేసులు ఉన్నాయి.పెద్ద సంఖ్యలో కేసులు ఉండడం వల్ల వీటి పర్యవేక్షణలోపంతో పలుమార్లు కోర్టు ధిక్కార కేసులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కేసులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కోర్టు కేసులన్నింటిని డిజిటల్ ఫార్మట్లోకి తేవడం ద్వారా పేరా వైస్ రిమార్కులు, కౌంటర్ అపిడవిట్లు, రిట్ పిటీషన్లు, జడ్జిమెంట్ కాపీలన్నింటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ విధానం ద్వారా మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్స్, జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమాచార లోపాన్ని పూర్తిగా తగ్గడంతో పాటు మరింత సమన్వయంతో కోర్టు కేసులను ఎదుర్కోవడానికి ఉపయోగపడనుంది. జీహెచ్ఎంసీలోని ప్రతి విభాగాధిపతులకు కోర్టు కేసులకు సంబంధించి ప్రత్యేక లాగిన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ లాగిన్ ద్వారా సంబంధిత విభాగాలకు సంబంధించి పేరా వైస్ రిమార్కులు, కౌంటర్లు, తగు దస్తావేదులు అప్లోడ్ చేయడంతో పాటు తమ క్రింది స్థాయి సిబ్బంది పనితీరును కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలును విభాగాధిపతులకు ఉంటుంది. సర్కిళ్లు, వివిధ అంశాలవారిగా రూపొందించే నివేదికలు సంబంధిత సర్కిళ్లు, విభాగాల పనితీరును కూడా తెలియజేస్తాయి. న్యాయవాదులకు కూడా వేర్వేరుగా లాగిన్లు అందజేయడం ద్వారా వారికి చెల్లించే ఫీజుల వివరాలు కూడా స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్స్కు సంబంధిత అడ్వకేట్లు జవాబుదారిగా ఉండే అవకాశం కూడా ఏర్పడుతుంది. కోర్టు కేసులను డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తేవడంతో కోర్టు కేసుల నిర్వహణలో మరింత జవాబుదారి, పారదర్శకంగా ఉండే అవకాశం ఏర్పడింది. తద్వారా ఈ కేసుల పురోగతి, కౌంటర్లు దాఖలు చేయడం, రిట్ పిటీషన్లు, పేరా వైస్ రిమార్కులను దాఖలు చేసే అంశంలో జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం ద్వారా నేరుగా ప్రతి కేసును పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. దీంతో పాటు క్షేత్రస్థాయి అధికారులు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్స్, కేంద్ర కార్యాలయం మధ్య మరింత సమన్వయం ఏర్పడి పరిష్కారానికి మార్గం సుగమంకానుంది.