లాక్డౌన్ నుంచి వీటికి కూడా మినహాయింపు
కేంద్రం తాజా ఆదేశాలు..
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 22
కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ నుంచి మరికొన్నింటికి మినహాయింపు ఇస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలోనే విత్తనాలు, ఉద్యాన ఉత్పత్తులు, పరిశోధనా సంస్థలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే స్కూల్ బుక్స్, ఎలక్ట్రానిక్ ఫ్యాన్స్కు సంబంధించిన షాపులు కూడా లాక్ డౌన్ నుంచి మినహాయించినట్లు స్పష్టం చేసింది. మరోవైపు పట్టణాల్లోని బ్రెడ్ ఫ్యాక్టరీలు, మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, బియ్యం మిల్లులు, పప్పు మిల్లులతో పాటు ప్రీపెయిడ్ మొబైళ్లకు రీచార్జ్ చేసే పాయింట్లకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను మూసివేస్తే.. ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉండటం వల్ల కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, కేంద్రం అమలు చేసిన లాక్ డౌన్ మే 3 వరకు ఉండగా.. తెలంగాణలో మాత్రం లాక్ డౌన్ మే 7 వరకు కొనసాగనుంది.