వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన శిక్షలు
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 22
డాక్టర్లు, హెల్త్ వర్కర్లపై దాడి చేస్తే ఇక నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. హెల్త్ వర్కర్లపై దాడులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నది. దీనిపై ఇవాళ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. 1897 ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్లపై దాడి చేస్తే ఇక నుంచి దాన్ని నేరంగా పరిగణిస్తారు. కేవలం 30 రోజుల్లోనే విచారణ పూర్తి చేస్తారు. దోషిగా తేలిన వ్యక్తికి మూడు నెలల నుంచి అయిదేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. నిందితులకు 50వేల నుంచి 2 లక్షల వరకు జరిమానా కూడా విధించనున్నారు. ఒకవేళ చాలా తీవ్రమైన దాడి జరిగితే, దానికి మరో విధమైన శిక్షను అమలు చేయనున్నారు. దాడి తీవ్రంగా ఉన్న కేసుల్లో నిందితులకు 6 నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష అమలు చేస్తారు. వారికి లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా వసూల్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు హెల్త్వర్కర్లు కృషి చేస్తున్నారని, అలాంటివారిపై దాడులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. డాక్టర్లు, వర్కర్లపై ఎటువంటి హింసాత్మక దాడికి కానీ, వేధింపులకు కానీ పాల్పడినా.. వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు. డాక్టర్లకు రక్షణ కల్పించేందుకు ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఆ ఆర్డినెన్స్ను అమలు చేస్తామన్నారు. ఒకవేళ హాస్పిటల్ వాహనాలు, క్లినిక్లకు నష్టం జరిగితే, అప్పుడు మార్కెట్ విలువ ప్రకారం రెండింతల మొత్తాన్ని వసూల్ చేయనున్నారు. విమాన రాకపోకల గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.