YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కలెక్షన్ కింగ్ లుగా నేతలు

కలెక్షన్ కింగ్ లుగా నేతలు

కలెక్షన్ కింగ్ లుగా నేతలు
విజయవాడ, ఏప్రిల్ 24
అదేంటో మానవుడికి కోరికలు చాలా ఎక్కువ. రాజకీయ నాయకులకు అవి పదింతలు ఎక్కువ. అయిదు కోట్ల మంది ప్రజలకు 175 మంది శాసనసభ్యులు. అంటే ఏ కొద్ది మందికో ఎమ్మెల్యేలుగా అరుదైన అవకాశం లభిస్తుంది. మరి అలా ఎమ్మెల్యేగా ఎన్నికైతే చాలు అనుకుంటే రాజకీయమే కాదు. ఆ వెంటనే మంత్రి అయిపోవాలి. అక్కడ కూడా కీలకమైన శాఖలు పట్టేయాలి. ఇంకా చెప్పాలంటే ఉప ముఖ్యమంత్రి దాకా, వీలైతే ముఖ్యమంత్రి దాకా కూడా విజయ ప్రస్థానం సాగిపోవాలి. ఇలా అనుకుంటున్న వారి సత్తా చరిత్ర ఒక్కసారి తిరగేస్తే గాలివాటంగా గెలిచిన వారే ఎక్కువ మంది కనిపిస్తారు. నిజానికి జగన్ ప్రభంజనంలో ముక్కూ మొఖం తెలియని వారు ఈసారి చాలా మంది ఎమ్మెల్యేలు అయిపోయారు. ఇపుడు వీరు కన్ను మంత్రి పదవులపైన పడుతోంది.కాదేదీ రాజకీయానికి అతీతం అని మన నేతలు ఇపుడు కూడా రుజువు చేస్తున్నారు. కరోనా పేరిట ప్రజలకు సాయం అంటూ జనంలోకి దిగిపోయారు. ఆ తరువాత ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల పేరిట ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు జనంలో పడి వసూళ్ళకు శ్రీకారం చుట్టేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరు ఇలా కలెక్షన్ కింగులుగా అవతారం ఎత్తేశారు. అంతే కాదు, తమ నియోజకవర్గ పరిధిలో వ్యాపారుల నుంచి ప్రముఖుల వరకూ ఎవరినీ వదలడంలేదని కూడా విమర్శలు వస్తున్నాయి.ఆపద కాలంలో బాగా పనిచేయాలని, జనంలో ఉండాలని వైసీపీ హై కమాండ్ ఆదేశించిన సంగతి విదితమే. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని విరాళాల సేకరణలో ఇలా కొందరు ఫ్యాన్ పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. టార్గెట్లు పెట్టి మరీ చందాల దందా నడుపుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా తమ గొప్ప కోసం, అధినాయకత్వం మెప్పు కోసం. ఆనక మంత్రి పదవి కోసం వేస్తున్న గాలం అని చెప్పాలి. కొంత మంది అయితే బాగా విరాళాలు పోగు చేసి జిల్లా కలెక్టర్ కి ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపామని చెప్పుకుంటున్నారు. అపుడే తాము అమాత్యులైపోయినట్లుగా కలలు కంటున్నారు.నిజానికి జనంలో ఉండి సేవ చేయడం అంటే ధనంతోనే సంబంధం లేదు. పైగా వైసీపీ హైకమాండ్ కూడా ఎవరికీ విరాళాల సేకరణ పేరిట టార్గెట్ లు పెట్టలేదు. కొంతమంది అతి ఉత్సాహం కలిగిన నాయకులే ఇలా చేస్తున్నారని పార్టీలో వినిపిస్తున్న మాట. దీని వల్ల అటు పార్టీ పరువు పోతోందని అంటున్నారు. నిజానికి మంత్రి పదవులకు, కరోనా సాయానికి ఉన్న లింక్ ఏంటన్నది కూడా ఇలా చేస్తున్న వైసీపీ పెద్దలకే తెలియాలి అంటున్నారు. మరో వైపు ఒకరిద్దరు చేస్తున్నా ఈ తరహా చర్యలను ఆసరాగా తీసుకుని టీడీపీ నేతలు విమర్శలకు దిగిపోతున్నారు. ఏకంగా చంద్రబాబు సైతం లైన్లోకి వచ్చేసి వైసీపీ బలవంతపు వసూళ్ళు చేస్తోందని కూడ నిందలు వేస్తున్నారు. కీలకమైన సమయంలో జాగ్రత్తగా ఉండాలని వైసీపీ నేతలు, పదవుల్లో ఉన్న వారు ఇప్పటికైనా గ్రహించకపోతే అభాసుపాలవుతారని పార్టీలోని హితైషులు సూచిస్తున్నారు.

 

Related Posts